ఏపీలో కొనసాగుతున్న పేర్ల మార్పిడి..

- August 23, 2024 , by Maagulf
ఏపీలో కొనసాగుతున్న పేర్ల మార్పిడి..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల పేర్లు మార్పిడి ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత సర్కారు పథకాల పేర్లను మారుస్తోంది. తాజాగా మరికొన్ని పథకాల పేర్లను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. విద్యా శాఖలోని 5 పథకాల పేర్లు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది.

‘అమ్మ ఒడి’ని ‘తల్లికి వందనం’, ‘జగనన్న విద్యా కానుక’ను ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’గా ‘జగనన్న గోరుముద్ద’ను ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం’గా, ‘నాడు-నేడు’ను ‘మన బడి-మన భవిష్యత్’గా, ‘స్వేచ్ఛ’ పేరును ‘బాలికా రక్ష’గా, ‘ఆణిముత్యాలు’ని ‘అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం’గా మార్చింది.

కాగా, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పలు పథకాల పేర్లు మార్చిన సంగతి తెలిసిందే. గత సీఎం జగన్, దివంగత నేత వైఎస్సార్ పేరిట ఉన్న పథకాల పేర్లను కూటమి సర్కారు మార్చేసింది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన – పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్‌గా.. జగనన్న విదేశీ విద్యాదీవెన – అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా.. వైఎస్సార్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతిగా పేరు మార్చారు. వైఎస్సార్ కళ్యాణమస్తు పథకానికి చంద్రన్న పెళ్లి కానుక పేరు పునరుద్దరించారు. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకానికి.. సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రొత్సాహకంగా పేరు మార్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com