ఇజ్రాయెల్ ప్రధానిపై భౌతిక దాడికి యత్నం
- November 17, 2024
రెండు మిలిటెంట్ సంస్థలు- హమాస్, హెజ్బొల్లాపై ఏకకాలంలో దాడులు సాగిస్తూ వాటికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న ఇజ్రాయెల్కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.
ఏకంగా ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నివాసంపై దాడి జరిగింది.
ఆయన స్వస్థలం సిజేరియాలో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు ఫ్లాష్ బాంబులను ఆయన నివాసంపై విసిరారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ రెండు కూడా ఇంటి ఆవరణలో పడ్డాయని, ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదని ఇజ్రాయెల్ వెల్లడించింది. ఈ ఘటన జరిగినప్పుడు నెతన్యాహు గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ ఇంట్లో లేరు.
ఈ ఫ్లాష్ బాంబులను విసిరింది ఎవరు, ఎలా ఈ దాడికి పాల్పడ్డారనేది ఇంకా తెలియరాలేదు. దీనిపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సాగిస్తోన్నట్లు ఇజ్రాయెల్ పోలీసులు, షిన్బెట్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఏజెన్సీ అధికారులు తెలిపారు. మిలిటెంట్ గ్రూప్లే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు.
సిజేరియా.. హైఫా నగరానికి దక్షిణం వైపున 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తరచూ హెజ్బొల్లా ఈ ప్రాంతంపై దాడులు సాగిస్తుంటుంది. ఇది- నెతన్యాహు స్వస్థలం. ఎక్కువగా ఆయన ఇక్కడే నివసిస్తుంటారు. ఫలితంగా- ఆయన నివాసం ఉంటోన్న ప్రాంతాన్ని హైసెక్యూరిటీ జోన్గా ప్రకటించింది ఇజ్రాయెల్.
నెతన్యాహు ఇంటిపై ఇలా బాంబులను కురిపించడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కిందటి నెల 18వ తేదీన కూడా దాడులు జరిగాయి. అప్పట్లో ఈ దాడులకు హెజ్బొల్లా కారణమంటూ ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ (ఐఆర్ఎన్ఏ) వెల్లడించింది.
ఈ దాడుల కోసం మూడు అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ను వినియోగించినట్లు ఇజ్రాయెల్కు చెందిన హీబ్రూ మీడియా కథనాన్ని ఉటంకించింది. యాహ్యా సిన్వర్, ఇస్మాయిల్ హనియే హత్యోదంతాల అనంతరం ఇజ్రాయెల్- లెబనాన్, ఇజ్రాయెల్- గాజా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్నట్లు పేర్కొంది.
నెల రోజుల వ్యవధిలో చోటు చేసుకున్న ఈ రెండు ఘటనలను తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నామని, తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ తెలిపింది. ఈ ఘటన పట్ల ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. షిన్ బెట్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఏజెన్సీ అధికారులతో మాట్లాడారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









