మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ

- November 24, 2024 , by Maagulf
మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ

ముంబై: మహారాష్ట్రలో 288 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి భారీ విజయం సాధించింది.రాత్రి 9. 30 గంటల వరకు ఎన్నికల సంఘం ప్రకటించిన ఫలితాల ప్రకారం, మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ఇప్పటి వరకు ఆ పార్టీ 128 స్థానాల్లో విజయం సాధించింది. మరో 4 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. మహాయుతి కూటమిలోని శివసేన (శిందే వర్గం) 55 స్థానాల్లో గెలిచింది, మరో రెండు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎన్సీపీ 40 చోట్ల గెలిచింది, ఒక చోట ఆధిక్యంలో ఉంది.కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి వెనుకంజలో ఉంది.

ఇప్పటి వరకు, కాంగ్రెస్ 13 స్థానాల్లో గెలుపొంది, మరో మూడు చోట్ల ఆధిక్యంలో ఉంది. శివసేన (ఉద్దవ్ ఠాక్రే) 20 సీట్లు సాధించింది. ఎన్సీపీ (శరద్ పవార్) 10 స్థానాలను గెలుచుకుంది.

ఝార్ఖండ్‌లో జేఎంఎం 34 సీట్లు, బీజేపీ 21 సీట్లు, కాంగ్రెస్ 16 సీట్లు సాధించాయి.

మహాయుతి భారీ విజయంతో బీజేపీ, శివసేన(శిందే), అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గం కార్యకర్తలు, నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.

అయితే, మహాయుతి కూటమి ప్రభుత్వానికి కాబోయే కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.

మహారాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ జితేంద్ర దీక్షిత్ బీబీసీ‌తో మాట్లాడుతూ, మహాయుతి కూటమిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని చెప్పారు. అందువల్ల బీజేపీ నేత మాత్రమే ముఖ్యమంత్రి కాగలరని ఆయన అభిప్రాయపడ్డారు. అలా జరిగితే, ముందుగా గుర్తుకొచ్చే పేరు దేవేంద్ర ఫడణవీస్. ఆయన కాకపోతే మరో కొత్తపేరు తెరపైకి రావొచ్చన్నారాయన.

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌‌లలో బీజేపీ అనూహ్యంగా కొత్త వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసిందని, అదే సంప్రదాయాన్ని ఇక్కడ కూడా కొనసాగిస్తే ఫడణవీస్ కాకుండా మరొకరిని ముఖ్యమంత్రి పదవి వరించవచ్చని జితేంద్ర అన్నారు.

అలా చూస్తే, సుధార్ ముంగంటీవార్ పేరు ముందువరుసలో ఉంటుందని జితేంద్ర దీక్షిత్ చెప్పారు. ఓబీసీ ప్రతినిధిగా ఆయనకు అవకాశం దక్కొచ్చన్నారు. అలాగే, వినోద్ తావ్డే, పంకజ ముండే పేర్లు కూడా పరిశీలించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com