దేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష తెలుగు: సీఎం రేవంత్ రెడ్డి
- January 05, 2025
హైదరాబాద్: తెలుగు వారు విదేశాలకు వెళ్లినా ఒకే వేదిక పై ఐక్యంగా కలవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.హైదరాబాద్లోని హెచ్ఐసీసీ వేదికగా మూడు రోజుల పాటు జరిగిన ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సీఎం, ప్రత్యేక ప్రసంగం చేశారు.
తెలుగుతో అనుబంధం తగ్గొద్దు
విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు తెలుగును మరచిపోకూడదని, ప్రపంచంలో నూతన జ్ఞానం కోసం ఏ భాష నేర్చుకున్నా, తమ మాతృభాషను తక్కువ చేయకుండా గౌరవించాల్సిన అవసరముందని సీఎం సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న హైదరాబాదు సంస్థలు నగర అభివృద్ధికి మార్గం చూపుతున్నాయని, ఇక్కడి వృద్ధికి తెలుగు పారిశ్రామిక వేత్తలు మరింతగా తోడ్పడాలని సీఎం ఆహ్వానం పలికారు.
తెలంగాణ అభివృద్ధికి గత ముఖ్యమంత్రుల కృషి చాలా ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసి సాంకేతిక విప్లవానికి నాంది పలికారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఐటీ రంగాన్ని వేగంగా అభివృద్ధి చేసి తెలంగాణకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను తీసుకువచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏర్పాటు చేసిన ఓఆర్ఆర్, అంతర్జాతీయ విమానాశ్రయం, ఫార్మా రంగ పెట్టుబడులు కూడా రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా మారాయి’’ అని గుర్తు చేశారు. తెలంగాణ ఆదాయంలో 65 శాతం నగరమైన హైదరాబాద్ నుంచే వస్తోందని, ఇది గత ముఖ్యమంత్రులు తీసుకున్న పరిణామకర నిర్ణయాల ఫలితమని సీఎం తెలిపారు.
జాతీయ రాజకీయాల్లో సన్నగిల్లిన తెలుగువారి పాత్ర
దేశ రాజకీయాల్లో నీలం సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ వంటి మహానుభావులు కీలక పాత్ర పోషించారని సీఎం గుర్తు చేశారు. ఆ తర్వాత వెంకటస్వామి, జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు వంటి నాయకులు జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపారని వివరించారు. అయితే ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో తెలుగువారి ప్రభావం తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ గర్వకారణం
‘‘దేశంలో తయారవుతున్న బల్క్ డ్రగ్స్లో 35 శాతం హైదరాబాద్ నుంచే ఉత్పత్తి అవుతుండటం ప్రతి తెలుగువాడికి గర్వకారణం. కానీ, చట్టసభల్లో తెలుగువారు మాట్లాడతారా అని ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత నాయకుల ఔన్నత్యాన్ని గుర్తు చేసుకుంటూ, నేటి రాజకీయాల్లో తెలుగువారి పాత్రను మరింత బలపరచాలని అవసరం ఉంది’’ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







