మహా నాయకుడు....!
- May 28, 2025
ఆయన రూపం సమ్మోహనం. సుమనోహరం. అభినయ వేదం. నటనకు విశ్వవిద్యాలయం. తెలుగువారి ఖ్యాతిని విశ్వమంతా ఎలుగెత్తి చాటిన జాతిరత్నం. తెలుగుజాతి ఐక్యతా చిహ్నం. వెండితెరవేల్పు. మేలుకొలుపు. ప్రేక్షక ప్రపంచ ఆరాధ్యదైవం. తెలుగు సినీ చరిత్రలో ఆయనో సువర్ణాధ్యాయం. సాంఘికం, పౌరాణికం, చారిత్రకం, జానపదం.. ఇలా ఏదైనా ఆయనకు నటనే ప్రాణప్రదం. ఆకర్షించే ఆహార్యం. ఆకట్టుకునే అభినయం. అలరించే గళం. సుస్వర భాస్వరం. వెరసి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన ఓ వరం. ఆయనే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు. తెలుగుజాతి ఐక్యతను ఆకాంక్షించిన తెలుగోడు.. జన హృదయాల్లో ఎన్టీవోడు.. నందమూరి తారక రామారావు. పల్లె, పట్టణం, నగరం, దేశం. ఇలా ఒక్కచోట ఏమిటి ? ఎక్కడైనా ఆయనే కథానాయకుడు. నేడు ఆయన 102వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం...
వెండితెరపై తెలుగుదనానికి నిలువెత్తు సంతకం. నటనకు రాజముద్ర. అశేష ప్రేక్షకజన హృదయాలపై చెరగని ముద్ర. ఆయన సినిమాలు సామాజిక చైతన్య ప్రబోధాలు. కర్తవ్య సందేశాలు. ఆయనే నందమూరి అందగాడు. జానపదాల్లో వగలరాణికి సొగసుగాడు. సాంఘిక చిత్రాలలో ప్రేక్షక హృదయాలు కొల్లగొట్టిన 'వేటగాడు'. పౌరాణికాలలో కొలుపులు అందుకున్న యుగ పురుషోత్తముడు. నటసార్వభౌముడు. నందమూరి తారకరాముడు. తెలుగు సినీ చరిత్రకే కథా నాయకుడు. ఆయనే ప్రజలంతా ప్రేమగా పిలుచుకునే ఎన్టీవోడు.
1923,మే 28వ తేదీన ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరి, వెంకట్రావమ్మ దంపతులకు జన్మించిన ఎన్టీఆర్ గా సూపరిచితులైన నందమూరి తారక రామారావు స్వశక్తితో అంచెలంచెలుగా ఎదిగి భారత దేశ సినీ, రాజకీయ రంగాల్లో తనకంటూ ప్రత్యేకమైన అధ్యాయాన్ని సృష్టించుకున్నారు. కృషి, పట్టుదల, క్రమశిక్షణలను చిన్నతనంలోనే అలవర్చుకుని తన జీవితంలో పెట్టుకున్న ప్రతి లక్ష్యాన్ని సాధిస్తూ వచ్చారు.
ఆనాటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేవలం 4 సబ్ రిజిస్టార్ ఉద్యోగాలు కోసం నిర్వహించిన పరీక్షలో ఆంధ్ర ప్రాంతం నుంచి ఉత్తీర్ణత సాధించిన ఏకైక వ్యక్తిగా నిలిచినా ఆ ఉద్యోగ ధర్మంలో ఉన్న అవినీతితో రాజీ పడలేక తాను నమ్మిన ఆశయాలకు, ఆదర్శాలకు అనుగుణంగా ఏంతో కష్టపడి సాధించిన సబ్ రిజిస్ట్రార్ వంటి ఉన్నత శ్రేణి ఉద్యోగానికి రాజీనామా చేసిన అరుదైన వ్యక్తి ఎన్టీఆర్.
స్వతహాగా అందగాడు, ఆజానుబాహుడైన ఎన్టీఆర్ విద్యార్థి దశలోనే నటన మీద ఆసక్తి ఏర్పడి పలు నాటకాల్లో నటించడం జరిగింది. నటన మీద మక్కువతో దర్శక దిగ్గజం ఎల్వీ ప్రసాద్ ఆశీస్సులతో 1949లో 'మనదేశం' చిత్రం ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి అనంతర కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. తన తోటి హీరోల్లా ఎన్టీఆర్ ఒకే తరహా పాత్రలకే పరిమితం కాకుండా సాంఘిక, జానపద మరియు అనేక విశిష్టతో కూడిన వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి తనలోని నట తృష్ణను తీర్చుకోవడమే కాకుండా ప్రేక్షకులను సైతం మెప్పించారు .
ఎన్టీఆర్ తన తరం సమకాలీన కథనాయకుల్లో ఎవరు చేయనటువంటి సామాజిక, సాంఘిక , జానపద, పౌరాణికాలకు (శ్రీరాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు వంటి దైవత్వం కలిగిన పాత్రలతో పాటుగా రావణ, కీచక,దుర్యోధనుడు వంటి చారిత్రాత్మక ప్రతినాయక పాత్రలు) సంబంధించిన అనేక నవరస పాత్రలను అవలీలగా పోషించి నటనలో తనకు తిరుగులేదని నిరూపించారు. అందుకే ఆయన్ని ప్రేక్షకులు, సినీ పండితులు "విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు"గా కీర్తించారు. దర్శకరత్న దాసరి నారాయణరావు గారు చెప్పినట్లు, మొత్తం భారతదేశంలోనే మినిమమ్ గ్యారంటీ కలిగిన అరడజను మంది హీరోలలో ఎన్టీఆర్ ఒకరు. రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించిన ఆయన సినిమాలు అనేకం. విజయా-వాహిని ఆసియాలోనే అతిపెద్ద స్టుడియోగా అభివృద్ధి చెందిందంటే, అందుకు తొలి రోజులలో ఆయన నటించిన సినిమాలు చేసిన దోహదం అపారం.
ఎంతటి మహానటుడికైనా కెరీర్ లో ఎత్తుపల్లాలు సహజం. ఎన్టీరామారావుకు 1975 తర్వాత కెరీర్ లో అన్ని విజయాలేమీ లేవు. కృష్ణ తో నటించిన దేవుడు చేసిన మనుషులు, తర్వాత తను నటించిన నిప్పులాంటి మనిషి తర్వాత కొంత గ్యాప్ తప్పలేదు. సరిగ్గా ఈ సమయంలో నాడు ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ వచ్చి ఎన్టీఆర్ కెరీర్ గ్రాఫ్ మార్చి వేశారు. తర్వాత కాలంలో వారిలో ఒకరు దర్శకేంద్రుడుగా, మరొకరు దర్శక రత్నగా ప్రసిద్ధి చెందారు. వారే అప్పటి యువ దర్శకులు దాసరి, రాఘవేంద్రరావు.1976లో దాసరి ఎన్టీఆర్తో తీసిన హిట్ మూవీ 'మనుషులంతా ఒక్కటే' చేస్తే..1977లో రాఘవేంద్రరావు ఆయనతో సెన్సెషనల్ హిట్ అడవిరాముడు తీశారు. ఆ తర్వాత ఇద్దరితో వరుసపెట్టి సినిమాలు తీశారు ఎన్టీఆర్. అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లు, సిల్వర్ జూబ్లీలే. ఆ సినిమాలు ఎన్టీఆర్ను ఎదురులేని, తిరుగులేని హీరోగా నిలబెట్టాయి.
హీరోగా ఉచ్ఛస్థితిలో ఉన్న సమయంలోనే అధికారమే పరమావధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ పెద్దల పాదాల చెంత తాకట్టు పెట్టిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తీరును నిరసిస్తూ తెలుగు వారి ఆత్మగౌరవం పేరుతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థుల ఎంపికకు ఎన్టీఆర్ పలు రకాల పద్దతులను అనుసరించారు. యువత ముఖ్యంగా పట్టుభద్రులకు మరియు రాజకీయంగా వెనుకబడిన వర్గాలైన బీసీ, దళితులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు.
దేశ రాజకీయాల్లో అప్పటి వరకు కాకలు తీరిన ఏ దిగ్గజ రాజకీయ నాయకుడికి సుసాధ్యం కానీ, కనీవినీ ఎరుగని రీతిలో పార్టీ స్థాపించిన కేవలం 8 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సీఎం అయిన వెంటనే పరిపాలనలో అనేక సంస్కరణలు మరియు మునుపెన్నడూ లేనటువంటి పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ధారాళంగా ప్రవేశపెట్టారు.
పేదవాడు పట్టెడన్నం తినేందుకు ప్రవేశ పెట్టిన రెండు రూపాయలకే కిలో బియ్యం,పేదల కోసం పక్కా గృహాలు, సగం ధరకే జనతా వస్త్రాలు, ఉపాధి హామీ పథకం, నీరు పేదలకు నెలకు 30 రూపాయల పింఛన్ , ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 55 వేల మంది వితంతు మహిళలకు 50 రూపాయిలు పింఛన్ , అసంఘటిత కార్మికులకు 30 రూపాయలకు పింఛన్ అమలు చేసిన ఘనత ఎన్టీఆర్ సొంతం.
రైతుల కోసం 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్, నీటి తిరువా రద్దు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సాగు నీటి పారుదల వ్యవస్థ పూనర్నిర్మాణం, సన్న,చిన్నకారు రైతుల భూమి శిస్తూ రద్దు ,రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన వంటి పలు పథకాలను విజయవంతంగా అమలు చేయడం జరిగింది. రైతాంగం మేలు కోసం సహకార వ్యవస్థను బలోపేతానికి కృషి చేస్తూనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమ రంగ అభివృద్ధికి దోహదపడ్డారు.
సామాన్య ప్రజానీకానికి విద్యా, వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశ్యం తో ప్రతి మండల కేంద్రం లో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని , జిల్లా పరిషత్ హైస్కూల్, జూనియర్ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది.బడుగు ,బలహీన, అణగారిన గిరిజన, దళిత వర్గాలకు చెందిన వారికి ఆర్థిక , సామాజిక, రాజకీయ, విద్య , ఉపాధి రంగాల్లో అపారమైన అవకాశాలు, సామాజిక భద్రత కల్పించి వారి అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి ఎన్టీఆర్.
విద్య యొక్క విలువ తెలిసిన ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా విద్యా రంగంలో రాష్ట్రాన్ని దేశంలో ఆదర్శంగా నిలిపేందుకు ఎన్నో చర్యలు చేపట్టారు . పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది .అలాగే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని గ్రామాల్లో ప్రాథమిక స్కూళ్లు ఏర్పాటు చేయడం మరియు సాంకేతిక , వైద్య విద్యలకు సంబంధించిన పలు విప్లవాత్మక సంస్కరణలు, ఎంసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ, క్యాపిటేషన్ ఫీజులు రద్దు మొదలైనవి ఈ రంగంలో ఎన్టీఆర్ సాధించిన విజయాలు.
ఎన్టీఆర్ ను గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి చేరువ చేసిన ముఖ్యమైన పాలనా సంస్కరణ మండల వ్యవస్థ నిర్మాణం. ప్రజలకు పారదర్శకంగా, వేగంగా, మెరుగైన సేవలు అందించేందుకు అప్పటి వరకు పాలన వ్యవస్థలో బలంగా ఉన్న గ్రామ మునుసుబు, కరణాల వ్యవస్థను ఒక్క కలం పోటుతో రద్దు చేసి సంచలనం సృష్టించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన వెంటనే అధికార వికేంద్రీకరణతో ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత పటిష్ట పరిచేందుకు, మండల యూనిట్ గా గ్రామాల అభివృద్ధికి మండల వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది.
ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారు. దేశంలో మొదటి సారిగా ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించడంతో ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ 30 శాతం మహిళలకే కేటాయించారు. జిల్లా, మండల ప్రజాపరిషత్తులలో 9శాతం చైర్మన్ పదవులు మహిళలకే రిజర్వు చేశారు. మహిళల సంక్షేమం కోసం 14 పథకాలు, అంశాల్లో కృషి చేశారు. స్త్రీ, శిశు సంక్షేమ కార్యక్రమాలు సత్వరంగా, సక్రమంగా అమలు జరిపేందుకు మహిళాభ్యుదయ, శిశు సంక్షేమ శాఖను ఏర్పాటు చేశారు.
ఎన్టీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది సాధారణ మధ్యతరగతి, వెనుకబడిన తరగతుల కుటుంబాలకు చెందిన యువతను, కార్మిక, కర్షక మరియు మైనారిటీలను, మహిళలను నాయకులుగా తీర్చిదిద్ది రాజకీయాల్లో తగినన్ని అవకాశాలు కల్పించారు. ఆయన కల్పించిన అవకాశాలు సద్వినియోగం చేసుకుని ఏంతో మంది రాజకీయాల్లో రాణించారు. ఆనాడు ఆయన ఎంపిక చేసిన యువకులే నేడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలకమైన నాయకులుగా కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ ను తమ రాజకీయ గురువుగా చెప్పుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు పోటీపడతారు.
ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాకుండా జాతీయ రాజకీయాల్లో సైతం చక్రం తిప్పారు.1984 లోక్ సభ ఎన్నికల్లో ఎన్టీఆర్ నేతృత్వంలోని తెలుగు దేశం పార్టీ 8వ లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించడంతో జాతీయ స్థాయిలో రాజకీయ ప్రయాణం మొదలైంది. పాలనలో మితిమీరిన జోక్యం చేసుకుంటున్న గవర్నర్ వ్యవస్థ మీద జాతీయ స్థాయిలో తిరుగుబాటు చేసిన మొదటి ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోయారు.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక శక్తులతో కలిసి 1989లో నేషనల్ ఫ్రంట్ కూటమిని ఏర్పాటు చేశారు. తానే స్వయంగా ఫ్రంట్ అధ్యక్ష భాద్యతలు చేపట్టి సార్వత్రిక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఓటమిలో మరియు ఫ్రంట్ తరుపున వి.పి.సింగ్ ప్రధానమంత్రి కావడంలో సైతం కీలకమైన పాత్ర పోషించారు. ఆయనిచ్చిన స్పూర్తితోనే అనంతర కాలంలో కేంద్రంలో పలు ప్రభుత్వాల (1996లో యునైటెడ్ ఫ్రంట్, 1998, 1999, 2024ల్లో ఎన్డీయే ప్రభుత్వాలు) ఏర్పాటులో తెలుగుదేశం పార్టీ కీలకమైన పాత్ర పోషించింది.
నటన ద్వారా ఎన్టీఆర్ తెలుగు భాష, జానపద సంప్రదాయాలను పునరుజ్జీవింపజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, సామాజిక న్యాయం, పరిపాలన వికేంద్రీకరణ, ప్రజాకేంద్రిత పాలన సంస్కరణలను ప్రవేశపెట్టారు. గ్రామీణ పేదల ఆత్మగౌరవానికి ఎంతో విలువను తెచ్చారు. తెలుగు వారికి జాతీయస్థాయిలో గుర్తింపును ఇచ్చి తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చాటారు. ఈ క్రమంలోనే ప్రతి సంవత్సరం మే 28వ తేదీన ఎన్టీఆర్ జయంతిని ‘రాష్ట్ర స్థాయి వేడుకగా’ జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశిస్తూ జీవో జారీ చేసింది
ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ. సినిమా రంగంలో వున్నప్పుడూ అంతే, రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత అంతే! ఆయన ఎక్కడుంటే అక్కడ ఒక మహాకాంతివలయం కదులుతూ కనిపించేది. కృషిని నమ్ముకున్న రైతుబిడ్డ ఆయన. కళాకారుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన పట్టిందల్లా బంగారం అయింది. రాశిలోనే కాదు వాశిలోనూ సినీ, రాజకీయ రంగాల్లో ఆయనది అగ్రస్థానమే! ఆయనది ఎప్పటికీ నంబర్ వన్ స్థానమే!
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- క్రాస్ బార్డర్ స్మగ్లింప్ పై స్పెషల్ ఫోకస్..సౌదీ అరేబియా
- ఒమన్ ఆదాయాలను పెంచుతున్న పర్యాటక రంగం..!!
- యూఏఈ లాటరీ: 7 మంది అదృష్టవంతులు..ఒక్కొక్కరికి Dh100,000..!!
- ECB వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆశలు పెట్టుకున్న QNB..!!
- దుబాయ్ విమానాశ్రయంలో ఇన్ఫ్లుయెన్సర్ అబ్దు రోజిక్ అరెస్టు..!!
- సముద్ర పర్యావరణానికి నష్టం.. నలుగురి అరెస్టు..!!
- ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు కన్ను మూత
- చిన్నారి హత్య కేసు: ఇరాన్లో ప్రజల ముందే ఉరిశిక్ష
- టీయూఐ విమానంలో వాష్ రూంలో దమ్ముకొట్టిన జంట…
- ఒమన్ నుంచి ఫుజైరాకు ఎమిరాటీలు ఎయిల్ లిఫ్ట్..!!