భారత్-బ్రెజిల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు
- July 09, 2025
బ్రెజిల్: ప్రపంచంలో అస్తిరత నెలకొన్న వేళ భారత్-బ్రెజిల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ప్రపంచ స్థాయిలో స్థిరత్వానికి మూలస్తంభంగా నిలుస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.ఈ రెండు దేశాల భాగస్వామ్యం కేవలం గ్లోబల్ సౌత్ కోసం మాత్రమే కాదని, మొత్తం మానవాళి ప్రయోజనాల కోసమని చెప్పారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లులా డ సిల్వాతో చర్చల అనంతరం జరిగిన సంయుక్త ప్రెస్ కాన్ఫరెన్స్లో మోదీ మాట్లాడారు. భారత్-బ్రెజిల్ లాంటి పెద్ద ప్రజాస్వామ్య దేశాలు గ్లోబల్ ఫోరమ్లలో గ్లోబల్ సౌత్కు ప్రతినిధులుగా వ్యవహరించడం తమ నైతిక బాధ్యతగా భావిస్తున్నాయని మోదీ తెలిపారు. మానవాళి సంక్షేమం కోసం కూడా ఇది అవసరమని నొక్కి చెప్పారు.
ఉగ్రవాదాన్ని సహించేది లేదు
ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించేది లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. టెర్రరిజాన్ని రూపుమాపే విషయంలో రెండు దేశాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని చెప్పారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిపట్ల కూడా జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తున్నట్లు వివరించారు. అలాగే, రక్షణ రంగంలో ఈ ఇరు దేశాల మధ్య సహకారం పరస్పర విశ్వాసానికి సంకేతమన్నారు. ‘రక్షణ పరిశ్రమల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలపర్చేందుకు మేము కృషి చేస్తాం. ఏఐ, సూపర్ కంప్యూటింగ్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో సహకారం వేగంగా విస్తరిస్తోంది’ అని అన్నారు.
అలాగే, ఇండియా- బ్రెజిల్ మధ్య ఇంధన రంగంలో భాగస్వామ్యం పెరుగుతోందని మోదీ పేర్కొన్నారు. శుద్ధ ఇంధనం, పర్యావరణ పరిరక్షణ విషయంలో సహకారాన్ని పెంపొందించేందుకు ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. భారత్ అభివృద్ధి చేసిన యూపీఐ వ్యవస్థను బ్రెజిల్లో ప్రవేశపెట్టే యోచనపై రెండూ దేశాలు కలిసి పనిచేస్తున్నట్లు మోదీ ప్రకటించారు. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంతరిక్ష రంగాల్లో భారత అనుభవాన్ని బ్రెజిల్తో పంచుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
20 మిలియన్ డాలర్ల వాణిజ్యం
వైద్య రంగంలో ఇరు దేశాల మధ్య సహకారం పెరుగుతోందని మోదీ వెల్లడించారు. ఆయుర్వేదం, సంప్రదాయ వైద్యం వ్యవస్థలను బ్రెజిల్లో విస్తరించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. వ్యవసాయం, పశుపోషణ, ఆహార ప్రాసెసింగ్ రంగాల్లో రెండు దేశాలు కలసి పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్-బ్రెజిల్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని వచ్చే ఐదేళ్లలో 20 బిలియన్ డాలర్లకు పెంచాలనే లక్ష్యాన్ని ఇద్దరు నాయకులు ప్రకటించారు. బ్రెజిల్కు ఫుట్బాల్ అంటే ఇష్టమని, క్రికెట్ అంటే భారత్ కు ప్రాధాన్యమని, ఈ రెండు దేశాలు ఒకే జట్టుగా పనిచేస్తే, 20 బిలియన్ డాలర్ల లక్ష్యం సాధ్యమే అని మోదీ ఉద్ఘాటించారు. అలాగే, వీసా కేంద్రాల్లో బారులు తీరకుండా, పర్యాటకులు, విద్యార్థులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు స్వేచ్ఛగా వెళ్లేలాగా తాము చర్యలు తీసుకుంటామని మోదీ అన్నారు. ఇదిలా ఉండగా, బ్రెజిల్ అధ్యక్షుడు లులా మోదీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదరన్ క్రాస్’ ను ప్రదానం చేశారు.
మూడు కీలక అంశాలపై ఒప్పందాలు
భారత్- బ్రెజిల్ దేశాధినేతల మధ్య జరిగిన చర్చల్లో మూడు కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయని ప్రత్యేక మీడియా సమావేశంలో ఎంఈఏ సెక్రటరీ (ఈస్ట్) పి. కుమారన్ తెలిపారు. ఉగ్రవాదం, అంతర్జాతీయ నేరాలపై సహకారం, డిజిటల్ రంగంలో సమస్యల పరిష్కారం, పునరుత్పత్తి ఇంధన రంగాలలో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు .
భారతదేశం మరియు బ్రెజిల్ మధ్య సంబంధం ఏమిటి?
1948లో దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి, రెండు దేశాలు ఒకే సంవత్సరంలో రాయబార కార్యాలయాలను ప్రారంభించాయి. భారతదేశం బ్రెజిల్ యొక్క పూర్వ రాజధాని అయిన రియో డి జనీరోలో రాయబార కార్యాలయాన్ని ప్రారంభించింది మరియు తరువాత 1971లో బ్రెజిలియాకు మారింది.
బ్రెజిల్ భారతదేశానికి మంచి స్నేహితుడా?
మిత్రులారా, ప్రపంచ స్థాయిలో, భారతదేశం మరియు బ్రెజిల్ ఎల్లప్పుడూ సన్నిహిత సమన్వయంతో పనిచేశాయి. రెండు ప్రధాన ప్రజాస్వామ్య దేశాలుగా, మా సహకారం ప్రపంచ దక్షిణానికి మాత్రమే కాకుండా, మొత్తం మానవాళికి కూడా సంబంధించినది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







