హైదరాబాద్ టూ చెన్నై వయా అమరావతి..
- August 29, 2025
భారతదేశంలో రైల్వే ప్రయాణికులే అధికం. అయితే, కొన్ని నగరాలకు వెళ్లేందుకు ఇప్పటికే బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. వీటితో చాలా వరకు ప్రయాణికుల సమయం ఆదా అవుతుంది. ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా మరో బుల్లెట్ ట్రైన్ దూసుకెళ్లేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏపీ రాజధాని అమరావతి మీదుగా ఈ బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టనుంది. ఇందుకోసం హైదరాబాద్ – చెన్నై మధ్య హైస్పీడ్ ఎలివేటెడ్ ట్రైన్ కారిడార్ నిర్మాణం చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఎలైన్మెంట్ కు ప్రాథమిక ఆమోదం లభించింది.
దేశంలోని మెట్రో నగరాల మధ్య బుల్లెట్ రైళ్లు నడిపించేందుకు కేంద్రం హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఏపీ మీదుగా హైదరాబాద్ – చెన్నై, హైదరాబాద్ – బెంగళూరు కారిడార్లకు చోటు కల్పించారు. అయితే, ఈ రెండు కారిడార్లలోనూ హైదరాబాద్ నుంచి శంషాబాద్ వరకు 38.5 కిలోమీటర్ల కామన్గా ఉండనుంది. ఆ తరువాత నుంచి చెన్నై, బెంగళూరు వైపు వేర్వేరు కారిడార్లు ఉంటాయి.
హైదరాబాద్ – చెన్నై హైస్పీడ్ కారిడార్ కోసం 744.5 కిలోమీటర్లు ఎలైన్మెంట్ ను ప్రాథమికంగా ఖరారు చేశారు. తెలంగాణలో 236.48 కిలోమీటర్లు, ఏపీలో 448.11 కిలోమీటర్లు, తమిళనాడులో 59.98 కిలోమీటర్లు ఈ బుల్లెట్ ట్రైన్ ప్రయాణిస్తుంది. ఇది సీఆర్డీయే మీదుగా వెళ్లనుంది. అయితే, ఇప్పటికే హైదరాబాద్ – బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్ ఎలైన్మెంట్కూ ప్రాథమిక ఆమోదం లభించింది. ఇది.. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల మీదుగా పరుగులు పెట్టనుంది.
హైదరాబాద్ – చెన్నై హైస్పీడ్ కారిడార్.. హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్ – ముంబయి హైస్పీడ్ రైలు కారిడార్ నుంచి మొదలై.. శంషాబాద్, నార్కట్ పల్లి, సూర్యాపేట, ఖమ్మం/కోదాడ మీదుగా వచ్చి సీర్డీయే మీదుగా గుంటూరు వైపు వెళ్తుంది. అక్కడి నుంచి చీరాలవైపు వెళ్లి విజయవాడ – చెన్నై రైల్వేలైన్ కు సమాంతరంగా చెన్నై వెళ్తుంది.
ఇది నేరుగా చెన్నైకి కాకుండా తిరుపతి మీదుగా వెళ్లేలా ఎలైన్మెంట్ లో మార్పులు చేస్తే తిరుపతికి వెళ్లేవారికి ప్రయోజనకరంగా ఉంటుందన్న చర్చ జరుగుతుంది. అదేజరిగితే.. కారిడార్ పొడవు పెరుగుతుంది. హైదరాబాద్ – చెన్నై హైస్పీడ్ కారిడార్ ప్రాజెక్టు కోసం రెండు వరుసల లైన్ (డబుల్ ట్రాక్), లూప్ లైన్లు, సైడింగ్స్ కలిపి మొత్తం 1,419.4 కిలోమీటర్లు మేర ట్రాక్ నిర్మించాలి.
హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ కారిడార్ లో భాగంగా.. తెలంగాణలో ఆరు, ఏపీలో ఎనిమిది, తమిళనాడులో ఒక స్టేషన్ నిర్మిస్తారు. ఈ కారిడార్లో ఏపీలో అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, నాయుడుపేట, తడ స్టేషన్లు ఉండనున్నాయి. ఇకవేళ నేరుగా చెన్నైకి కాకుండా తిరుపతి మీదుగా వెళ్లేలా ఎలైన్మెంట్లో మారిస్తే తిరుపతికి వెళ్లేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. అప్పుడు గూడూరు నుంచి తిరుపతి మీదుగా చెన్నై వెళ్లేలా మారిస్తే నాయుడుపేట, తడ తగలవు.
మరోవైపు.. హైదరాబాద్-బెంగళూరు కారిడార్లో ఏపీలో కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, దుద్దేబండ, హిందూపురం ప్రాంతాల్లో ప్రతిపాదిత స్టేషన్లుగా నిర్ణయించారు. హైదరాబాద్-అమరావతి-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు మధ్య బుల్లెట్ రైళ్ల కారిడార్లు పూర్తయ్యి.. అలాగే బెంగళూరు-చెన్నై మధ్య చేపట్టే బుల్లెట్ రైలు ప్రాజెక్టూ అందుబాటులోకి వస్తే.. హైదరాబాద్, అమరావతి, చెన్నై, బెంగళూరు నగరాల మధ్య బుల్లెట్ రైళ్ల చతుర్భుజి వచ్చినట్లు అవుతుంది. దీనివల్ల ఈ నగరాల మధ్య గంట నుంచి రెండు గంటల్లోనే చేరుకునే అవకాశం కలగనుంది.
తాజా వార్తలు
- భారత మేధో, సాంస్కృతిక పునరుజ్జీవనానికి బెంగాల్ కేంద్రబిందువు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- భారత్ ఫస్ట్ స్లీపర్ AC కోచ్, 5-స్టార్ హోటల్ కూడా తలదించాల్సిందే!
- సర్ (SIR) ప్రక్రియ: ఓటరు జాబితా ప్రక్షాళనలో కీలక అడుగు
- యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- మచిలీపట్నం బస్స్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్దేవ్ యోగాభ్యాసం
- ముంబై ఐఐటీ క్యాంపస్లో చిరుతపులి కలకలం
- బ్యాంకింగ్ రంగంలో దివ్యాంగుల హక్కుల ఉల్లంఘనపై UBIDEF ఆందోళన
- యూఏఈలో ఎండలు మండుతున్నాయి..49.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు
- కువైట్లో యోగా వేడుకల్లో 2,200 మందికి పైగా భాగస్వామ్యం..!!







