మలేషియా వెళ్లే భారతీయులకు కేంద్రం కొన్ని సూచనలు

- August 29, 2025 , by Maagulf
మలేషియా వెళ్లే భారతీయులకు కేంద్రం కొన్ని సూచనలు

కౌలాలంపూర్: మలేషియా ప్రభుత్వం భారతీయులకు 30 రోజుల వీసా ఫ్రీ ఎంట్రీ సౌకర్యాన్ని కల్పించింది. అయితే, ఈ సదుపాయం అందుబాటులో ఉన్నప్పటికీ, చాలా మంది భారతీయ పౌరులు మలేషియా విమానాశ్రయాల్లో అడుగుపెట్టకుండానే వెనక్కి తిరిగి రావలసి వస్తోంది. అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని ‘నాట్ టు ల్యాండ్’ (NTL) కేటగిరీ కింద చేర్చి, దేశంలోకి ప్రవేశాన్ని నిరాకరిస్తున్న ఘటనలు ఇటీవల పెరిగాయని భారత్‌లోని మలేషియా హైకమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఫ్రీ వీసాతో ఉద్యోగాల కోసం సెర్చింగ్
భారతీయ ప్రయాణికులను వెనక్కి పంపడానికి గల ప్రధాన కారణాలను కూడా హైకమిషన్ స్పష్టంగా వివరించింది. ప్రయాణానికి సరిపడా డబ్బు లేకపోవడం, బస చేసేందుకు సరైన ఆధారాలు (హోటల్ బుకింగ్ వంటివి) చూపించకపోవడం, తిరుగు ప్రయాణానికి కచ్చితమైన విమాన టికెట్ లేకపోవడం వంటి కారణాలతో ఎంట్రీని నిరాకరిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా ఈ వీసా పథకాన్ని అడ్డం పెట్టుకుని ఉద్యోగాల కోసం వస్తున్నారని అనుమానం వచ్చినా కూడా వారిని అనుమతించడం లేదని తెలిపింది.

ఇలా ‘నాట్ టు ల్యాండ్’ కింద తిరస్కరణకు గురైన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని ఏ విమానయాన సంస్థ మలేషియాకు తీసుకొచ్చిందో, అదే సంస్థ వారిని తిరిగి భారత్‌కు పంపేంత వరకు విమానాశ్రయంలోనే వేచి ఉండాల్సి వస్తుంది. దీనికి కొన్నిసార్లు ఎక్కువ సమయం పట్టడంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే చిక్కుకుపోతున్నారు.

మరోవైపు, ఈ వీసా ఫ్రీ పథకాన్ని ఆసరాగా చేసుకుని కొందరు మోసపూరిత ఏజెంట్లు అమాయక భారతీయులను తప్పుదోవ పట్టిస్తున్నారని హైకమిషన్ హెచ్చరించింది. ఈ స్కీమ్ కింద మలేషియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం చేస్తున్నారని, అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ వీసా ఫ్రీ పథకం కేవలం పర్యటనల కోసమేనని, ఉద్యోగాల కోసం కాదని స్పష్టం చేసింది. కాబట్టి మలేషియాకు వెళ్లే భారతీయ పౌరులు ప్రయాణానికి అవసరమైన అన్ని పత్రాలు, నిధులు, రిటర్న్ టికెట్ వంటివి కచ్చితంగా దగ్గర ఉంచుకోవాలని, ఇమ్మిగ్రేషన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని హైకమిషన్ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com