కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం

- September 22, 2025 , by Maagulf
కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం సెప్టెంబర్‌ 22, 2025 నుంచి దేశవ్యాప్తంగా కొత్త జీఎస్టీ (New GST) రేట్లు అమల్లోకి వచ్చాయి. ఈ మార్పుతో చిన్న కార్లపై పన్ను 28% నుంచి 18%కి తగ్గించబడగా, SUVలపై జీఎస్టీ రేటు 28% నుంచి 40%కు పెరిగింది. అయితే SUVలపై ఉన్న సెస్‌ను పూర్తిగా రద్దు చేయడంతో వాటి ధరలు కూడా తగ్గిపోయాయి. ఫలితంగా, ఈ ఫెస్టివ్‌ సీజన్‌లో కొత్త కార్లు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ఇది అపూర్వమైన అవకాశం అవుతుంది.

ప్రముఖ కంపెనీల ధరల తగ్గింపు వివరాలు
ప్రస్తుతం అన్ని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు తమ కార్ల ధరలను గణనీయంగా తగ్గించాయి. మారుతి సుజుకి స్విఫ్ట్ పై రూ.1.06 లక్షలు, డిజైర్పై రూ.87 వేల తగ్గింపు ప్రకటించింది. హ్యుందాయ్‌ కంపెనీ i20 N లైన్ పై రూ.1.08 లక్షలు, వెన్యూపై రూ.1.23 లక్షల తగ్గింపు ఇచ్చింది. టాటా మోటార్స్ ఇప్పటికే సెప్టెంబర్ 8 నుంచే ధరలు తగ్గించగా, నెక్సాన్పై రూ.1.55 లక్షలు, హారియర్పై రూ.1.40 లక్షల తగ్గింపు కల్పించింది. మహీంద్రా కూడా ముందే తగ్గింపులు ప్రారంభించి, థార్పై రూ.1.35 లక్షలు, XUV 700పై రూ.1.43 లక్షలు తగ్గించింది. కియా, స్కోడా, వోక్స్వాగన్, టయోటా వంటి అంతర్జాతీయ కంపెనీలు కూడా భారీ రాయితీలు ప్రకటించాయి. ముఖ్యంగా టయోటా ఫార్చ్యూనర్పై రూ.3.49 లక్షలు, కియా కార్నివాల్పై రూ.4.48 లక్షల వరకు ధర తగ్గించడం ఆటో మార్కెట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

వినియోగదారులకు గోల్డెన్‌ ఛాన్స్
ఈ ధరల తగ్గింపులు వినియోగదారులపై నేరుగా ప్రభావం చూపనున్నాయి. పండుగ సీజన్‌లో కొత్త కారు కొనాలని ప్లాన్ చేసుకున్న వారికి ఇది నిజమైన “గోల్డెన్ టైమ్”. గతంలో ఎప్పుడూ లేని రీతిలో ధరలు తగ్గడంతో, వినియోగదారుల కొనుగోలు శక్తి మరింత పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో ఆటోమొబైల్ రంగం కూడా భారీ స్థాయిలో అమ్మకాలను సాధించి ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పోసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, కొత్త జీఎస్టీ విధానం ఆటోమొబైల్ మార్కెట్‌ను మరింత వేడి చేయనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com