దుబాయ్ లో తెలంగాణా వాసి ఆత్మహత్య
- July 20, 2016
బతుకుదెరువు కోసం పొట్ట చేత పట్టుకొని గల్ఫ్ దేశం వెళ్లిన వలసజీవికి అక్కడా కష్టాలు తప్పలేదు. సరైన పనిలేక, చాలీచాలని జీతంతో చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. బోయినపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన ఎడపెల్లి అంజయ్య(44)కు ఎకరంన్నర భూమి ఉన్నా, సాగునీటి వసతి లేదు. చాలా సంవత్సరాలుగా భూమి బీడుగా ఉంటోంది. భార్యాభర్తలు ఇద్దరు కూలీకి వెళ్లి తమ కుటుంబాన్ని పోషించేవారు. ఎంతచేసినా ఇక్కడ సరైన ఉపాధి లేకపోవడంతో అంజయ్య రూ.రెండు లక్షలు అప్పు చేసి రెండేళ్ల క్రితం దుబాయి వెళ్లాడు. అక్కడ చాలీచాలని జీతంతో లేబర్ పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇక్కడ అంజయ్య భార్య విజయ కూలీకి వెళ్తూ పిల్లలను చదివిస్తోంది. గతేడాది డిసెంబర్లో అంజయ్య స్వగ్రామానికి వచ్చి పెద్ద కూతరు జ్యోతి వివాహం చేశాడు. వివాహ సమయంలో రూ.రెండు లక్షల వరకు అప్పు చేశాడు. రెండో కూతురు మనీష గంగాధరలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. చిన్న కూతురు శివాణి తొమ్మిదో తరగతి. ఇద్దరు కూతుళ్లు ఎదుగుతున్నారు... వారి చదువుల ఖర్చు, తదితర అవసరాలు ఎలా తీర్చాలి.. పైగా రూ.4లక్షల దాకా అప్పులున్నాయని మనస్తాపం చెందుతుండేవాడు. అప్పుడప్పుడు కుటుంబసభ్యులకు ఫోన్ చేసి కూతుళ్లకు పెళ్లి ఎలా చేయాలని భార విజయతో వాపోయేవాడు. ఈ నేపథ్యంలో మానసికంగా కుంగిపోయిన అంజయ్య ఈనెల 19న దుబాయిలోని తన గదిలో ఉరేసుకున్నాడు. ఈ విషయాన్ని అక్కడివారు ఫోన్ ద్వారా తెలియజేశారు. నాలుగు రాళ్లు వెనుకేసుకొస్తాడనుకున్న వ్యక్తి అందరినీ వదిలివెళ్లడంతో కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మృతదేహం త్వరగా స్వగ్రామానికి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







