సుప్రీంకోర్టులో తెలంగాణ గవర్నమెంట్ కి ఎదురుదెబ్బ

- October 16, 2025 , by Maagulf
సుప్రీంకోర్టులో తెలంగాణ గవర్నమెంట్ కి ఎదురుదెబ్బ

న్యూ ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను పెంచేందుకు ప్రయత్నించగా, సుప్రీంకోర్టులో కీలక నిర్ణయం వెలువడింది. సర్వోన్నత న్యాయస్థానం రిజర్వేషన్లు 50 శాతం మించరాదు అని స్పష్టంగా గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు పేర్కొన్నట్లు, అవసరమైతే పాత రిజర్వేషన్ల విధానంతోనే ఎన్నికలు నిర్వహించవచ్చని, ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదని చెప్పారు. వివరాల ప్రకారం, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే జీఓ 9పై హైకోర్టు స్టే విధించింది. దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ధర్మాసనంలో జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా విచారణ చేశారు.

ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ రీజనింగ్ వివరించారు, రాష్ట్రంలో కులగణన సర్వే ఆధారంగా రిజర్వేషన్లు పెంచడమే శాస్త్రీయ నిర్ణయం, అసెంబ్లీలో అన్ని పార్టీలు దీనికి ఏకాభిప్రాయం తెలిపారు అని చెప్పారు. అయితే, గత సుప్రీంకోర్టు తీర్పు (కృష్ణమూర్తి కేసు) ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని స్పష్టమని ప్రతివాదుల తరఫు న్యాయవాది వాదించారు.దీనిని పరిగణనలోకి తీసుకుని ధర్మాసనం పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేదని, అయితే హైకోర్టులో విచారణను కొనసాగించాలని సూచించింది. సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై కొత్త ఉత్కంఠను సృష్టించింది. ఈ నేపధ్యంలో ప్రభుత్వం తదుపరి చర్చలు, కేబినెట్ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవాలని ఊహిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com