అయోధ్య రామ్ మందిర్: అంగరంగ వైభవంగా ధ్వజారోహణ..

- November 25, 2025 , by Maagulf
అయోధ్య రామ్ మందిర్: అంగరంగ వైభవంగా ధ్వజారోహణ..

అయోధ్య: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం అయోధ్య రామ మందిర శిఖరంపై కాషాయ వర్ణ ధర్మ ధ్వజాన్ని ఎగరేశారు. ఆ సమయంలో భావోద్వేగానికి గురయ్యారు.

‘అభిజీత్ ముహూర్తం’లో ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. ధ్వజారోహణ మహోత్సవం ద్వారా శ్రీ రామ జన్మభూమి ఆలయ నిర్మాణం పూర్తైనట్లు సూచించారు. పూజారులు అత్యంత శుభంగా భావించే ఈ సమయానికి పతాకారోహణ నిర్వహించారు. 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో లంబకోణ త్రిభుజాకృతితో ఉన్న పతాకంపై సూర్యుడు, పవిత్ర ఓం, కోవిదార వృక్షాన్ని పసిడి దారంతో చేతితో ఎంబ్రాయిడరీ చేశారు.

శ్రీరాముడి తేజస్సు, శౌర్యాన్ని ప్రతిబింబించేలా దీన్ని రూపొందించారు. ఆలయ శిఖరంపై 42 అడుగుల ఎత్తులో ఈ ధ్వజాన్ని ఎగరేశారు. గర్భగుడిలో బాలరాముడికి మోదీ ప్రత్యేక పూజలు చేశారు.

ఈ మహోత్సవంలో ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, రామ్ జన్మభూమి ట్రస్ట్ సభ్యులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంతో ఆలయంలోని 44 తలుపులు పూజా ఆచారాల కోసం తెరుచుకున్నాయి.

ధ్వజారోహణ కార్యక్రమాన్ని సుమారు 7,000 మంది అక్కడే ఉండి తిలకించారు. గత ఏడాది జనవరి 22న బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ సీతారాముల కల్యాణం జరిగిన వివాహ పంచమి. అలాగే, రాముడు అభిజిత్‌ లగ్నంలో జన్మించాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com