తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- December 22, 2025
తిరుమల: వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. తోపులాటలు, గందరగోళం లేకుండా శాంతియుతంగా దర్శనం కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఏడాది డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు మొత్తం 10 రోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా తొలి మూడు రోజుల్లో భక్తుల రద్దీ అత్యధికంగా ఉండే అవకాశం ఉండటంతో, ప్రత్యేక నియంత్రణ చర్యలు చేపట్టింది.
తొలి మూడు రోజులు స్లాటెడ్ దర్శన విధానం అమలు
వైకుంఠ ద్వార దర్శనాల మొదటి మూడు రోజులు అంటే డిసెంబర్ 30 (ఏకాదశి), డిసెంబర్ 31 (ద్వాదశి), జనవరి 1 తేదీల్లో టోకెన్ లేని భక్తులకు దర్శనం ఉండదని టీటీడీ స్పష్టం చేసింది. ఈ మూడు రోజులకు సంబంధించి ఈ-డిప్ విధానంలో ముందస్తుగా 1.76 లక్షల మంది భక్తులకు సర్వదర్శన స్లాటెడ్ టోకెన్లు కేటాయించింది. మొదటి రోజున కేవలం 5 గంటల పాటు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు నిర్వహించనుండగా, మిగిలిన సమయమంతా స్లాటెడ్ టోకెన్లు కలిగిన భక్తులకే దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. రోజుకు 60,000 మందికి పైగా భక్తులకు 14 స్లాట్లలో టోకెన్లు జారీ చేశారు.
మూడు ప్రవేశ మార్గాలు–భక్తులకు కీలక సూచనలు
భక్తుల రద్దీని సమర్థంగా నియంత్రించేందుకు టీటీడీ మూడు వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రవేశ మార్గాలను ఏర్పాటు చేసింది.
- ఉదయం స్లాట్ల భక్తులు: కృష్ణతేజ సర్కిల్ నుంచి
- మధ్యాహ్నం స్లాట్ల భక్తులు: ఏటీజీహెచ్ (ATGH) నుంచి
- రాత్రి స్లాట్ల భక్తులు: శిలాతోరణం సర్కిల్ నుంచి దర్శనానికి అనుమతిస్తారు
భక్తులు తమకు కేటాయించిన స్లాట్ సమయానికే ప్రవేశ మార్గాలకు చేరుకోవాలని, టోకెన్తో పాటు ఆధార్ లేదా గుర్తింపు పత్రాలు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని టీటీడీ సూచించింది. సూచించిన మార్గాలనే అనుసరించి, మార్గం మార్చకుండా, పోలీస్ మరియు టీటీడీ సిబ్బంది ఆదేశాలను పాటించాలని కోరింది. భద్రత పరంగా అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







