వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- December 22, 2025
న్యూ ఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వందే భారత్ స్లీపర్ ట్రైన్ ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తైంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మధ్య నిర్వహించిన ఫీల్డ్ ట్రయల్ ఎటువంటి సాంకేతిక సమస్యలు లేకుండా సక్సెస్ కావడంతో త్వరలో ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.
ఇప్పటికే దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు వేగంగా పరుగులు పెడుతున్న నేపథ్యంలో, రాత్రి ప్రయాణాలకు అనువుగా స్లీపర్ వెర్షన్ను భారతీయ రైల్వే అభివృద్ధి చేస్తోంది. తొలి దశలో దాదాపు 200 వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ఇందులో ఎక్కువ సంఖ్యలో రైళ్లు మధ్యప్రదేశ్కు సంబంధించిన ప్రధాన మార్గాల్లో నడిచే అవకాశం ఉంది. ప్రస్తుతం 10 స్లీపర్ వందే భారత్ రైళ్ల తయారీ పనులు కొనసాగుతున్నాయి.
ఇటీవల మధ్యప్రదేశ్లోని కజురహో నుంచి ఉత్తరప్రదేశ్లోని మహోబా వరకు రెండు రోజుల పాటు ఈ స్లీపర్ వందే భారత్ ట్రైన్ ఫీల్డ్ ట్రయల్ నిర్వహించారు. ఝాన్సీ రైల్వే బోర్డ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మనోజ్ కుమార్ సింగ్ తెలిపిన (Vande Bharat sleeper train) వివరాల ప్రకారం, ట్రయల్ సమయంలో రైలు వేగం, మెకానికల్, టెక్నికల్ అంశాలను పూర్తిగా పరీక్షించారు. అలాగే ఆధునిక ‘కవచ్’ భద్రతా వ్యవస్థను కూడా విజయవంతంగా పరీక్షించారు. ఈ ట్రయల్లో SRDO, రైల్వే ఇంజినీర్లు, టెక్నికల్ టీమ్, ICF చెన్నై బృందం పాల్గొన్నారు.
శనివారం ట్రయల్ రన్లో రైలును గంటకు 115 కిలోమీటర్ల వేగంతో నడిపగా, ఆదివారం రోజున వేగాన్ని 130 కిలోమీటర్లకు పెంచారు. మహోబా నుంచి కజురహో వరకు ట్రయల్ రన్ విజయవంతంగా ముగిసింది. తొలి దశలో ఈ రైలు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడవనుండగా, భవిష్యత్తులో గరిష్ట వేగాన్ని 160 నుంచి 220 కిలోమీటర్ల వరకు పెంచే యోచనలో ఉన్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు.
అధికారిక సమాచారం ప్రకారం, వందే భారత్ స్లీపర్ ట్రైన్లో మొత్తం 16 కోచ్లు ఉంటాయి. వీటిలో 10 థర్డ్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, ఒక ఫస్ట్ ఏసీ కోచ్తో పాటు రెండు సీటింగ్ కమ్ లగేజ్ కోచ్లు ఉండనున్నాయి. తొలుత ఢిల్లీ–ముంబై రూట్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించేందుకు భారతీయ రైల్వే ప్లాన్ చేస్తోంది. ఈ మార్గంలో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండటంతో డిమాండ్ ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఢిల్లీ–ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్కు సంబంధించి కూడా తాజా అప్డేట్ వచ్చింది. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా గుజరాత్లోని వడోదర సమీపంలో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం దాదాపు పూర్తయ్యిందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కూడా ఢిల్లీ–ముంబై మార్గంలోనే ప్రారంభం కానుందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!
- విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ వీసా.. కువైట్ కీలక నిర్ణయం
- సింగపూర్లో భారత హై కమిషనర్తో సీఎం చంద్రబాబు భేటీ
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!
- హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ అలివర్ ట్రీ గాస్పి దుర్మరణం









