ఫోన్ ట్యాపింగ్‌ కేసులో లీక్స్‌ పై బీఆర్ఎస్ లీగల్‌ ఫైట్‌..!

- January 24, 2026 , by Maagulf
ఫోన్ ట్యాపింగ్‌ కేసులో లీక్స్‌ పై బీఆర్ఎస్ లీగల్‌ ఫైట్‌..!

హైదరాబాద్: ట్యాపింగ్‌ ఫైల్స్‌..తెలంగాణ పాలిటిక్స్‌లో హీవోల్టేజ్‌ హీట్‌ను క్రియేట్ చేస్తున్నాయి. రోజుకో లీకు..వారం రోజులకో ఇద్దరిని విచారిస్తూ..అటు ఇటు తిరిగి బీఆర్ఎస్‌ ముఖ్యనేతల వరకు చేరుకుంది. హరీశ్‌రావు, కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చి విచారించారు. త్వరలో మాజీ సీఎం గులాబీ బాస్ కేసీఆర్‌కు కూడా నోటీసులు ఇస్తారంటూ జరుగుతున్న ప్రచారంతో..ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై గాలి దుమారం నడుస్తూనే ఉంది.

అయితే ఓ వైపు కేసు విచారణను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్‌ లీడర్లకు..లీకుల పేరుతో జరుగుతున్న ప్రచారం తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోందట. మొదట హరీశ్‌, తర్వాత కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చి సిట్ విచారించింది. ఆ విచారణ సమయంలో లోపల ఒకటి జరిగితే..బయట జరిగిన ప్రచారం..మీడియాలో వచ్చిన వార్తలు మరోలా ఉన్నాయట. అయితే కావాలని కొందరు పోలీస్ అధికారులు లీకులు ఇచ్చి..తమ ప్రతిష్టను దిగజారుస్తున్నారని హరీశ్‌, కేటీఆర్ మండిపడుతున్నారు.

హరీశ్‌రావు విచారణకు సహకరించి..సిట్ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్తే..బయటికి ఏవేవో లీకులు ఇచ్చారని..అందుకే విచారణ జరిపిన వీడియోను బయటపెట్టాలని డిమాండ్ చేశారట హరీశ్. ఆ తర్వాత కేటీఆర్‌ను రాధాకిషన్‌రావుతో కలిపి విచారించినట్లు వార్తలు వచ్చాయ్. కట్‌ చేస్తే అక్కడ ఏ రావు లేడు. ఒక తారక రామారావు తప్ప అంటూ కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు.

అయితే ప్రతిదానికి తాము వివరణ ఇచ్చుకునేలోపే..లీకుల పేరుతో అడ్డగోలు ప్రచారం జరిగి..తమ నేమ్‌, ఫేమ్‌కు డ్యామేజ్ చేస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు గులాబీ పార్టీ ముఖ్యనేతలు. ఈ క్రమంలోనే లీకులు ఇస్తున్న పోలీసులకు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేశారు హరీశ్‌రావు.

అయితే ఫోట్‌ ట్యాపింగ్‌ కేసులో అవసరమైతే హరీశ్‌, కేటీఆర్‌ను మరోసారి విచారణకు పిలుస్తామన్నారు సిట్ చీఫ్, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో..అధికారులు ఇస్తున్న లీకులు, వేధింపులపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో తమపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు గులాబీ లీడర్లు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తమకు సంబంధం లేకున్నా విచారణ పేరుతో వేధించి రాక్షసానందం పొందుతున్నారని ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు, మిగతా హామీలపై ప్రశ్నిస్తున్నందుకే..హస్తం పార్టీ పెద్దల స్కామ్‌లను బయటపెడుతున్నందుకే తమపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని కేటీఆర్, హరీశ్‌రావు ఆరోపిస్తున్నారు.

సిట్ అధికారులు, ప్రభుత్వ పెద్దలు లేనిపోని లీకులు ఇచ్చి తమ ప్రతిష్టను దిగజార్చే కుట్ర చేస్తున్నారని కేటీఆర్ మండిపడుతున్నారు. మరీ ముఖ్యంగా డ్రగ్ కేసులతో లింక్ పెట్టడం, సినీ హీరోయిన్స్‌తో అక్రమ సంబంధాలు అంటగట్టడం వంటి లీకులతో తీవ్ర మనోవేదనకు గురయ్యానంటున్న కేటీఆర్..ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నట్లు ఓపెన్‌గా చెప్పేశారు.

ఆధారాలు లేని ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ మాత్రం సంబంధం లేని తమను విచారణ పేరుతో వేధించడంపై న్యాయపోరాటం చేసే అంశాన్ని కేటీఆర్ పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే లీగల్‌ ఎక్స్‌పర్ట్స్‌తో చర్చించిన కేటీఆర్..దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నారట. ఫోన్ ట్యాపింగ్ సహా పలు కేసుల్లో తమను ఇరికించి రాజకీయంగా ఇబ్బందిపెట్టాలని చూస్తున్న ప్రభుత్వ వైఖరిని, సిట్ అధికారుల తీరును లీగల్ ఫైట్ ద్వారానే ఎదుర్కోవాలని బీఆర్ఎస్ డిసైడ్ అయినట్లు టాక్.

ఈ క్రమంలోనే ఇప్పటికే సిట్‌ విచారణకు హాజరైన కేటీఆర్, హరీశ్..గులాబీ బాస్ కేసీఆర్‌తో ఫాంహౌస్‌లో సమావేశమై చర్చించారు. త్వరలో కేసీఆర్‌కు కూడా నోటీసులు ఇస్తారన్న ప్రచారం జరుగుతున్న వేళ..ఫాంహౌస్‌ భేటీ చర్చనీయాంశంగా మారింది. సేమ్‌టైమ్‌ సిట్‌ విచారణ, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై సుప్రీంకోర్టు తలుపు తట్టే అంశాన్ని కూడా అధినేతతో డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనా ఇక చూస్తూ ఊరుకుంటే పార్టీకి, తమ వ్యక్తిగత ప్రతిష్ఠకు డ్యామేజ్‌ జరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారట. అందుకే ఇక లీగల్‌ ఫైట్‌ చేసి..ఫోన్ ట్యాపింగ్‌ కేసులో జరుగుతున్న తప్పుడు ప్రచారానికి బ్రేకులు వేయాలని డిసైడ్ అయ్యారట బీఆర్ఎస్ ముఖ్యనేతలు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com