ఫోన్ ట్యాపింగ్ కేసు.. KCR విచారణ ప్రారంభం

- February 01, 2026 , by Maagulf
ఫోన్ ట్యాపింగ్ కేసు.. KCR విచారణ ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణ (TG) ఫోన్ ట్యాపింగ్‌ కేసు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నందినగర్‌ ఇంట్లో KCR విచారణ ప్రారంభమైంది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు ఆదివారం మధ్యాహ్నం పలు డాక్యుమెంట్లతో హైదరాబాద్ నందినగర్ లోని కేసీఆర్ నివాసంలోకి వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియను సిట్ అధికారులు వీడియో రికార్డు చేస్తున్నారు. ఈ విచారణ కోసం KCR ఉదయం ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి నందినగర్ నివాసానికి చేరుకున్నారు.విచారణకు సిట్ అధికారులు పూర్తి సన్నద్ధతతో రాగా, కేసీఆర్ కూడా తన వెంట ఒక నోట్‌బుక్, కొన్ని ముఖ్యమైన పత్రాలను తెచ్చుకున్నారు.

సిట్ బృందంలో మాదాపూర్ డీసీపీ రీతిరాజ్, ఐపీఎస్ అధికారులు విజయ్‌కుమార్, నారాయణరెడ్డి సహా పలువురు సీనియర్ అధికారులు ఉన్నారు.విచారణ మొదలుకాకముందే సిట్ అధికారులు ఎలక్ట్రానిక్ పరికరాలతో కేసీఆర్ గదిని పూర్తిగా తనిఖీ చేశారు. విచారణ ప్రక్రియ మొత్తాన్ని వీడియోలో రికార్డ్ చేస్తున్నారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులను మాత్రమే ఇంట్లోకి అనుమతించారు.అయితే.. విచారణ జరుగుతున్న గదిలోకి ఎవరినీ.. కనీసం లాయర్‌ను కూడా అనుమతించలేదని సమాచారం. ఎర్రవల్లి నుంచి వస్తున్న సమయంలో భారీగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలను పోలీసులు మార్గమధ్యలో అడ్డుకుని.. కేవలం కేసీఆర్ వాహనాలను మాత్రమే అనుమతించారు.

ప్రస్తుతం విచారణ కొనసాగుతుండగా.. ఆయన నివాసంలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.గత ప్రభుత్వ హయాంలో, ముఖ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులతో సహా దాదాపు 600 మందికి పైగా వ్యక్తుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ.ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ టి. ప్రభాకర్ రావుతో పాటు, కేటీఆర్, హరీశ్ రావు వంటి బీఆర్ఎస్ ముఖ్య నేతలను సిట్ ఇప్పటికే ప్రశ్నించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com