మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం: డీజీపీ శివధర్ రెడ్డి
- February 10, 2026
హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 11వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికలు సాఫీగా, ప్రశాంతంగా జరిగేలా చూడాలని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లాల ఎస్పిలు, కమిషనర్లు, ఎన్నికలు జరిగే ప్రాంతాల స్టేషన్ హౌస్ ఆఫీసర్ల (ఎస్ హెచ్)ను డిజిపి శివధర్ రెడ్డి కోరారు. ఎన్నికల సందర్భంగా ఎక్కడా గొడవలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత చేబట్టాలని ఆయన ఆదేశించారు. మంగళవారం నాడు జిల్లాల ఎస్పిలు, కమిషనర్లు, ఎన్నికల ప్రాంతాలలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి డిజిపి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల లో ఈ నెల 11వ తేదీన ఎన్నికలు జరగనుండడంతో దీనికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించడంతో పాటు దీనిపై తగిన సూచనలను చేశారు. 13వ తేదీన కౌంటింగ్ వుంటుందని దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా సవ్యంగా వుండాలని ఆయన ఆదేశించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని, ప్రభుత్వానికి, పోలీసు శాఖకు ఎక్కడా చెడ్డపేరు రావద్దని ఆయన కోరారు. ఎన్నికల్లో ఎక్కడా అక్రమాలు జరగకుండా చూడాలని, ఓటర్ల నుంచి, ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. నిబంధనల ప్రకారం పోలీసు లు ఎన్నికల విధులను కఠినంగా నిర్వహించాలని డిజిపి ఆదేశించారు.
హైదరాబాద్ పోలీసు లీగల్ అడ్వయిజర్ శ్రీరాములు మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన చట్టాలు ఎలా వుంటాయో వివరించారు. ఎన్నికల్లో ఎవరూ ఓటర్లను ప్రభావితం చేయకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై వుందని, ఓటర్లపై ఎవరూ ఒత్తిడి చేయకుండా చూడాలని ఆయన ఆదేశించారు. ఓటర్లను ఎన్నికల సందర్భంగా సామాజిక బహిష్కరణ, ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలపి ఆయన కోరారు.
ఎక్కడా మద్యం పంపిణీ జరగకుండా చూడాలని, లైసెన్స్ కలిగిన ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని, ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ఎలా వ్యవహరించాలనే దానిపై ముందుగానే వెల్లడించాలని, వీటిని ఉల్లంఘించే పార్టీల పై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ముందస్తు అనుమతి లేకుండా ఎవరూ ఎలాంటి సమావేశాలను నిర్వహిస్తే పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఎన్నికల్లో పాల్గొనే వారు వాహనాలను ఎంతమేరకు వినియోగించాలనే దానిపై చట్టంలో స్పష్టంగా వుందని, దీనిని ఎవరూ ఉల్లంఘించడానికి వీల్లేదని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మాణానికి కాంగ్రెస్ సిద్ధం
- మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం: డీజీపీ శివధర్ రెడ్డి
- విశాఖ మెట్రోకు గ్రీన్ సిగ్నల్
- టీటీడీకి రూ.30 లక్షలు విరాళం
- సీషెల్స్ దేశానికి ప్రధాని మోదీ $175 మిలియన్ల ఆర్థిక ప్యాకేజీ
- యూపీఐ ద్వారా పీఎఫ్..
- IAF Jobs 2026: వాయుసేనలో అగ్నివీర్ ఉద్యోగాలు
- షార్లెట్లో ఘనంగా NATS చదరంగం పోటీలు
- హైదరాబాద్లో ఏర్పాటు కానున్న అమెరికా దిగ్గజం కాస్ట్కో
- భారత్ లో వాటర్ మెట్రోలు ఏర్పాటుకు కేంద్రం భారీ ప్లాన్!









