నిమాయిష్ బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు

- February 12, 2026 , by Maagulf
నిమాయిష్ బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఖ్యాతి గడించిన నాంపల్లి నుమాయిష్ కేవలం ఒక వ్యాపార ప్రదర్శన మాత్రమే కాదని, అది మన రాష్ట్ర వాణిజ్య, సాంస్కృతిక వికాసానికి  రోల్ మోడల్‌గా నిలుస్తుంద‌ని ప‌ర్యాట‌క, సాంస్కృతిక‌, ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో  గురువారం ఏర్పాటు చేసిన బహుమతుల ప్రదానోత్సవ కార్య‌క్ర‌మానికి మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మంత్రి జూప‌ల్లి  మాట్లాడుతూ, ఈ ప్రదర్శనకు ఇప్పటి వరకు 20  ల‌క్ష‌లకు  పైగా  సందర్శకులు వచ్చారని, ఇది హైదరాబాద్‌పై ప్రజలకు ఉన్న మక్కువను, నుమాయిష్‌పై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు.  దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల  చిన్న, మధ్య తరగతికి చెందిన వ్యాపారులు ఉత్పత్తి చేసిన వస్తువులను విక్రయించుకునేందుకు మన నుమాయిష్‌ వేదిక కావడం సంతోషకరంగా ఉందన్నారు.  హైదరాబాద్ తో పాటు జిల్లాలకు ఎగ్జిబిషన్ ను విస్తరించాలని సూచించారు. 

 1938లో   స్థాపించిన ఈ  నుమాయిష్ అనాడు 100 స్టాళ్లతో మొదలై, నేడు 1050 స్టాళ్లకు చేరడం మన పారిశ్రామిక ప్రగతికి నిదర్శనమ‌ని తెలిపారు. వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ ఆర్థికంగా ఎద‌గ‌డంలో  నుమాయిష్ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. 

చార్మినార్, గోల్కొండ, బిర్యానీ తరహాలోనే 'నుమాయిష్' హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌లో అంతర్భాగమైంది. ఇది భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే వేదిక. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న ఉత్పత్తులు ఇక్కడ కొలువుదీరడం వల్ల ఇది ఒక 'మినీ ఇండియా'ను తలపిస్తోంది. మన గంగా-జమునా తెహజీబ్‌కు ఇది నిలువుటద్దం అని ఆయన అన్నారు.

వ్యాపారం ద్వారా వచ్చిన ఆదాయాన్ని తిరిగి సమాజానికి అందించడం గొప్ప విషయం. ముఖ్యంగా 19 విద్యా సంస్థలను నడుపుతూ, 30 వేల మంది విద్యార్థులకు, అందులోనూ మహిళా విద్యకు పెద్దపీట వేయడం ఎగ్జిబిషన్ సొసైటీ చేస్తున్న‌ అద్భుతమైన కృషికి నిద‌ర్శ‌నమ‌ని వెల్ల‌డించారు. నుమాయిష్ ద్వారా వచ్చిన ప్రతి రూపాయిని నిరుపేద విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు వినియోగించ‌డం అభినంద‌నీయమ‌ని అన్నారు. 

నుమాయిష్‌లో సందర్శకులకు ఉత్తమ సేవలను అందించిన స్టాల్‌ నిర్వాహకులు, పోలీస్‌, ట్రాఫిక్‌, విద్యుత్‌, ఆర్‌ అండ్ బీ, ఇత‌ర శాఖ‌ల‌ అధికారులకు బహుమతులను ప్రధానం చేశారు.  86వ నుమాయిష్ మరింత విజయవంతంగా, అద్భుతంగా జరగాలని అకాంక్షించారు. 

ఈ కార్య‌క్ర‌మంలో ఎగ్జిబిషన్ సొసైటీ  వైస్ ప్రెసిడెంట్ సుఖేష్ రెడ్డి, సెక్ర‌ట‌రీ బీఎన్. రాజేశ్వ‌ర్, ట్రెజ‌ర‌ర్ ఎన్. సంజీవ్ కుమార్, జాయింట్ సెక్ర‌ట‌రీ టి. చంద్ర‌శేఖ‌ర్, ప్రైజ్ డిస్ట్రిబ్యూష‌న్ అడ్వైజ‌ర్ పి. హ‌రినాథ్ రెడ్డి, క‌న్వీన‌ర్ బి.అనురాధ, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com