Bangladesh: తారిక్ రెహమాన్ ప్రధాని కావడం భారత్‌కు ప్రయోజనమా?

- February 14, 2026 , by Maagulf
Bangladesh: తారిక్ రెహమాన్ ప్రధాని కావడం భారత్‌కు ప్రయోజనమా?

బంగ్లాదేశ్‌లో జరిగిన గత నాలుగు సార్వత్రిక ఎన్నికలలో ఫలితాలు ప్రకటించిన వెంటనే గెలిచిన పార్టీని ఇతర విదేశీ నేతల కంటే ముందుగా భారత ప్రధానమంత్రి అభినందించారు. దిల్లీలో మన్మోహన్ సింగ్ లేదా నరేంద్ర మోదీ ఎవరు అధికారంలో ఉన్నా ఈ విధానం ఎలాంటి మినహాయింపు లేకుండా కొనసాగింది. ఫిబ్రవరి 13వ తేదీ ఉదయం కూడా ఈ సంప్రదాయమే పునరావృతమైంది. కానీ ఈసారి బంగ్లాదేశ్‌లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. వరుసగా నాలుగు ఎన్నికల్లో విజయాల తర్వాత, షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఫిబ్రవరి 13వతేదీ ఉదయం 9 గంటల ప్రాంతంలో ఎన్నికల ఫలితాల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ఆధిక్యంలోకి వచ్చిన తర్వాత, ప్రధాని నరేంద్ర మోదీ ఆ పార్టీని అభినందిస్తూ ఒక పోస్ట్ చేశారు.”బంగ్లాదేశ్ ప్రజలు మీ నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని ఈ విజయం ప్రతిబింబిస్తుంది” అని ఆయన ‘ఎక్స్’లో రాశారు.

గతంతో పోలిస్తే భిన్నమైన పరిస్థితులు
భారత్ చాలా కాలంగా పట్టించుకోని ఓ రాజకీయ నాయకుడిని ఉద్దేశించి ఈ సందేశం వెళ్లింది. ఈ అభినందనలను ఆయన అంగీకరించినప్పటికీ, దీనిని దౌత్యపరమైన యూ-టర్న్‌గా చూడవచ్చు. భారత్‌లోని పరిశీలకులు ఈ అంచనాతో ఏకీభవిస్తున్నట్టు కనిపిస్తోంది. బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బలమైన బీఎన్‌పీ ప్రభుత్వం ప్రస్తుతానికి భారత్‌కు అత్యంత ఆచరణీయమైన వ్యూహాత్మక ఎంపిక. దిల్లీ వైఖరిలో మార్పుకు ఈ ఆలోచనే ప్రాతిపదిక అని వారు భావిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోయే తారిక్ రెహమాన్ ద్వైపాక్షిక సంబంధాలపై ఇచ్చిన ప్రత్యేక హామీల కారణంగా ఇటీవలి పరిస్థితులు ఏర్పడ్డాయని భావిస్తున్నారు. బీఎన్‌పీ గతంలో అధికారంలో ఉన్న సమయంలో ఒడిదుడుకులున్నప్పటికీ గత విభేదాలను తవ్వితీయకుండా, ముందుకు సాగడానికి భారత్ సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రధాని మోదీ సందేశం కూడా దీనినే సూచిస్తోంది. బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వంతో చర్చలు నిర్దుష్ట అంశాలపై దృష్టి సారిస్తాయని కూడా భారత్ సంకేతాలిస్తోంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక రోజు ముందు చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

అయితే బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై ఆందోళనలను పరిగణనలోకి తీసుకోకుండా బంగ్లాదేశ్‌లోని ఏ ప్రభుత్వంతోనూ సంబంధాలు కొనసాగలేవని అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పునరుద్ఘాటించింది.

బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వ పాలన ముగిసి, ఎన్నికలు జరిగి ప్రభుత్వం తిరిగి ఏర్పడడాన్ని భారత్ స్వాగతిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మోదీ నేతృత్వంలో బీజేపీ తొలిసారి 2014లో పూర్తి మెజారిటీ సాధించిన సమయంలో బీఎన్‌పీ తాత్కాలిక చైర్మన్ తారిక్ రెహమాన్ లండన్‌లో ప్రవాసజీవితం గడుపుతున్నారు. బీజేపీ, బీఎన్‌పీ రెండింటివీ ఒకే విధమైన మధ్యేవాద జాతీయవాద భావజాలం కావడంతో వాటి మధ్య సహజ రాజకీయ సంబంధం ఉంటుందని భావిస్తారు. భారత జాతీయ కాంగ్రెస్ చారిత్రకంగా అవామీ లీగ్‌కు దగ్గరగా ఉంది. అది అధికారానికి దూరమైన తర్వాత, ఈ అంచనా సహజంగానే కనిపించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com