సిగరెట్ వివాదం, పెట్రోల్ బంక్ వద్ద లైటర్ విసిరి మంటలు

- February 21, 2026 , by Maagulf
సిగరెట్ వివాదం, పెట్రోల్ బంక్ వద్ద లైటర్ విసిరి మంటలు

రాయ్‌పూర్‌: పెట్రోల్ బంక్ వద్ద జరిగిన నిర్లక్ష్య చర్య పెద్ద ప్రమాదానికి దారి తీసే పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్ బంక్‌లో సిగరెట్ కాల్చవద్దని చెప్పినందుకు ఆగ్రహించిన వ్యక్తి, పెట్రోల్ నింపుతున్న బైక్ ట్యాంకులో లైటర్ విసరడంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. అయితే బంక్ సిబ్బంది అప్రమత్తంగా స్పందించి వెంటనే మంటలను అదుపులోకి తెచ్చడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల ప్రకారం ఇద్దరు వ్యక్తులు బైక్‌కు పెట్రోల్ పోయించుకోవడానికి బంక్‌కు వచ్చారు. పెట్రోల్ నింపుతున్న సమయంలో వెనుక కూర్చున్న వ్యక్తి దిగిపోయి సిగరెట్ కాల్చేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన బంక్ సిబ్బంది మరియు బైక్ డ్రైవర్ అతనిని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన వ్యక్తి చేతిలో ఉన్న లైటర్‌ను నేరుగా పెట్రోల్ ట్యాంకులోకి విసిరేశాడు. వెంటనే మంటలు చెలరేగి అక్కడ కలకలం రేపాయి.

ఘటన చోటుచేసుకున్న వెంటనే బంక్ ఉద్యోగి ఇంధన సరఫరాను నిలిపివేసి అగ్నిమాపక పరికరంతో మంటలను ఆర్పివేశాడు. ప్రమాదం తీవ్రరూపం దాల్చేలోపే పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను బంక్ సిబ్బంది పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ధర్మేంద్ర సింగ్ మరియు ఇమ్రాన్ ఖురైషిగా గుర్తించారు. వారి వద్ద ఉన్న బైక్ మరియు లైటర్‌ను స్వాధీనం చేసుకుని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పెట్రోల్ బంక్ వద్ద జరిగిన ఈ నిర్లక్ష్య చర్యపై అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com