మార్చి 1 నుండి మెసేజింగ్ యాప్స్ కొత్త రూల్స్

- February 27, 2026 , by Maagulf
మార్చి 1 నుండి మెసేజింగ్ యాప్స్ కొత్త రూల్స్

న్యూ ఢిల్లీ: భారతదేశంలో డిజిటల్ భద్రతను మరింత పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి ప్రముఖ మెసేజింగ్ అప్లికేషన్ల వినియోగంపై ‘సిమ్ బైండింగ్’ విధానాన్ని మార్చి 1 నుండి అమల్లోకి తీసుకురానుంది.

ఈ కొత్త నిబంధన ప్రకారం, మీ స్మార్ట్‌ఫోన్‌లో భౌతికంగా సిమ్ కార్డు ఉంటేనే సదరు నంబర్‌కు సంబంధించిన మెసేజింగ్ యాప్ పనిచేస్తుంది. గతంలో ఒక ఫోన్‌లోని నంబర్‌తో మరొక ఫోన్ లేదా ట్యాబ్‌లో వై-ఫై ద్వారా వాట్సాప్ వంటి సేవలను పొందే వీలుండేది, కానీ ఇకపై అది సాధ్యం కాదు. సైబర్ నేరగాళ్లు ఇతరుల నంబర్లతో ఖాతాలు సృష్టించి మోసాలకు పాల్పడకుండా ఉండేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, కంప్యూటర్ లేదా లాప్‌టాప్‌ల ద్వారా వెబ్ వెర్షన్ వాడే వారికి కూడా నిబంధనలు కఠినతరం చేశారు.వెబ్ లాగిన్ అయిన ప్రతి ఆరు గంటలకు ఒకసారి యూజర్లు తమ ప్రామాణీకరణను మళ్లీ పూర్తి చేయాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలోగా అథెంటికేషన్ చేయని పక్షంలో ఆ ఖాతా ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ అవుతుంది. ఆఫీసు పనుల కోసం నిరంతరం వెబ్ వెర్షన్‌పై ఆధారపడే వారికి ఇది కొంత ఇబ్బందికరంగా మారినప్పటికీ, భద్రత దృష్ట్యా ఇది తప్పనిసరి అని అధికారులు పేర్కొంటున్నారు.

ఈ కొత్త నిబంధనల అమలు కోసం విధించిన గడువును పొడిగించే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. టెలికాం రంగంలో పెరుగుతున్న మోసాలను అరికట్టడానికి మరియు వినియోగదారుల డేటాకు మరింత రక్షణ కల్పించడానికి ఈ చర్యలు అవసరమని కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మార్చి 1 నుండి ఈ మార్పులు అమల్లోకి వస్తుండటంతో వినియోగదారులు తమ మెసేజింగ్ యాప్స్ సెట్టింగ్స్‌ను ఒకసారి తనిఖీ చేసుకోవడం ఉత్తమం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com