విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు

- March 13, 2026 , by Maagulf
విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు

న్యూ ఢిల్లీ: యువతే దేశ భవిష్యత్తు అని, వారు సిద్ధాంతాలు, విలువల ప్రాతిపదికన రాజకీయాల్లోకి రావాలని భారత దేశ గౌరవ 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.ఢిల్లీలోని ఆయన నివాసంలో (నెం.1 త్యాగరాజ మార్గ్) శుక్రవారం పూణేలోని 'ఎంఐటి స్కూల్ ఆఫ్ గవర్నెన్స్' (MIT School of Governance) కు చెందిన ఎం.ఏ.పొలిటికల్ లీడర్‌షిప్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం వారితో ముచ్చటించి వారు అడిగిన సందేహాలను తీర్చారు.ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రాజకీయాల్లో అసహనానికి చోటు ఉండకూడదని, ప్రత్యర్థులను శత్రువులుగా చూడకుండా వారి అభిప్రాయాలను గౌరవించే సంస్కృతిని అలవర్చుకోవాలని స్పష్టం చేశారు.ప్రజా జీవితంలో నేతల ప్రవర్తన, భాష హుందాగా ఉండాలని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న శక్తి అపారమని, ప్రజలు బూతులు మాట్లాడే నేతలను ఓడిస్తారని స్పష్టం చేశారు.‘‘యువత రాజకీయాల్లోకి మరింత ఎక్కువగా రావాలి.  అయితే అది కేవలం అధికారం కోసం కాకుండా సిద్ధాంతాలు, విలువలు, ప్రజా జీవితంలో ఉన్నత ప్రమాణాలు, నిజాయితీ, మంచి ప్రవర్తనతో కూడిన రాజకీయం కోసం అయి ఉండాలి. రాజకీయాల్లో మొదటి సూత్రం అవతలి వారి దృక్పథాన్ని గౌరవించడం. రాజకీయ నాయకుడికి ఇతరుల మాట వినే ఓపిక ఉండాలి. ఒకవేళ ఏకీభవించకపోతే గౌరవప్రదంగా విభేదించాలే తప్ప వ్యక్తిగత దాడులు చేయకూడదు. ఎదుటిపార్టీలో ఉన్నవారు రాజకీయ ప్రత్యర్థులే కానీ శత్రువులు కాదన్నది గుర్తుంచుకోవాలి. ‘గౌరవప్రదంగా విభేదించడం' ప్రజాస్వామ్య లక్షణం. అడ్డంకులు సృష్టించే రాజకీయం కంటే అభివృద్ధి, నిర్మాణాత్మక చర్చలు అవసరం.’’ అని స్పష్టం చేశారు. రాజకీయాల్లో సోమరితనానికి చోటు లేదని, క్రమశిక్షణతో కూడిన సమయ పాలనే తనను ఈ స్థాయికి చేర్చిందని ఆయన వివరించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌.కె. అద్వానీ వంటి నేతల సమయ పాలనను ఆయన ఉదహరించారు. 

తాను ఎప్పుడూ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని, తన కుటుంబ సభ్యులను కూడా స్వశక్తితో ఎదగాలని ప్రోత్సహించానని ఆయన స్పష్టం చేశారు. నాయకులు పారాచూట్ లాగా దిగకూడదని, క్షేత్రస్థాయి నుంచి కష్టపడి పైకి రావాలని సూచించారు.డిజిటల్ విప్లవం వల్ల అవినీతి తగ్గుతోందని, అయితే యువత గ్యాడ్జెట్లకు బానిసలై తమ సృజనాత్మకతను కోల్పోకూడదని హెచ్చరించారు. భారతీయ సంస్కృతి, వారసత్వాన్ని కాపాడుకోవాలని  వెంకయ్య నాయుడు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. యువత రాజకీయాల్లోకి వచ్చే ముందు వివేకానంద, సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్, వాజ్‌పేయి వంటి మహనీయుల జీవితాలను అధ్యయనం చేయాలన్నారు.మాతృభాష కంటి చూపు వంటిదని, పరభాషలు కళ్లజోడు వంటివని ఆయన అభివర్ణించారు.రాజ్యసభలో 22 భాషల్లో మాట్లాడే వెసులుబాటు కల్పించిన విషయాన్ని గుర్తు చేస్తూ, రాజకీయ నాయకులు తమ ప్రజలకు చేరువ కావాలంటే మాతృభాషలోనే మాట్లాడాలని సూచించారు. భారతదేశం మళ్ళీ 'విశ్వగురువు'గా ఎదిగేందుకు యువత తమ వంతు కృషి చేయాలని, భారత్ విశ్వగురువుగా అవతరించడం అనేది విస్తరణ కోసం కాదని స్పష్టం చేశారు.ఇటీవల ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు, ఘర్షణల గురించి ప్రస్తావిస్తూ విస్తరణ వాదం, ఇతరుల భూభాగం పై వ్యామోహం సరికాదని  ఆధునిక నాగరికతలో యుద్ధాలు, హింస ఏమాత్రం మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com