సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి

- March 16, 2026 , by Maagulf
సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి

హైదరాబాద్: సంచలనం రేపిన సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సిద్ధార్ధ రెడ్డి నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిద్ధార్ధ రెడ్డి కోర్టులో సరెండర్ అయ్యాడు. ఫిబ్రవరి 17న సిద్ధార్ధ రెడ్డి అభ్యర్థనలను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు..నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. 24 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న అతడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అమెరికా నుంచి వచ్చి లొంగిపోయాడు. సిద్ధార్ధ రెడ్డికి హైకోర్టు విధించిన రెండేళ్ల శిక్షను సమర్థించిన సుప్రీంకోర్టు.. మార్చి 16వ తేదీలోగా లొంగిపోవాలని నాలుగు వారాల క్రితం ఆదేశించింది. ప్రత్యూష ఆత్మహత్య చేసుకునేలా సిద్ధార్ధ రెడ్డి ప్రేరేపించినట్లుగా కోర్టు నిర్ధారించిన సంగతి తెలిసిందే.

నటిగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే ప్రత్యూష ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. తమ ప్రేమను కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతో సిద్ధార్థ రెడ్డి, ప్రత్యూష కూల్‌ డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగారు. చికిత్స పొందుతూ ప్రత్యూష 2022 ఫిబ్రవరి 24న చనిపోయింది. సిద్దార్ధ్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు.

అయితే తన కూతురు ప్రత్యూషది ఆత్మహత్య కాదు హత్య అని ఆమె తల్లి న్యాయ పోరాటం చేసింది. ప్రత్యూష ఆత్మహత్య చేసుకునేలా సిద్ధార్థరెడ్డి ప్రేరేపించాడని ట్రయల్‌ కోర్టు గతంలో తీర్పునిచ్చింది. ఐదేళ్ల జైలు శిక్ష వేసింది. ఈ శిక్షను హైకోర్టు రెండేళ్లకు తగ్గించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాడు సిద్ధార్థ రెడ్డి. అత్యున్నత ధర్మాసనం సైతం ఇటీవల హైకోర్టు తీర్పునే సమర్ధించింది. అంతేకాదు 4 వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో సిద్ధార్థ రెడ్డి అమెరికా నుంచి వచ్చి నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com