భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..

- March 25, 2026 , by Maagulf
భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..

ఘజియాబాద్‌: హరీశ్ రానా కన్నుమూశారు. సుమారు 13 ఏళ్లు కోమాలో ఉన్న ఘజియాబాద్‌కు చెందిన హరీశ్ రానా మంగళవారం తుది శ్వాస విడిచారు. హరీశ్ తల్లిదండ్రులు కారుణ్య మరణం కోసం విజ్ఞప్తి చేయగా సుప్రీంకోర్టు అందుకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీలోని ఎయిమ్స్ డాక్టర్లు హరీశ్ కు క్రమంగా చికిత్స ఆపేశారు. ఈ క్రమంలో హరీశ్ మంగళవారం కన్నుమూశారు.

హరీశ్ 13 ఏళ్లు కోమాలో ఉన్నారు. జీవచ్ఛవంలా మంచానికే పరిమితం అయ్యారు. దీంతో హరీశ్ రాణాకు కారుణ్య మరణానికి (పాసివ్ యూతనేషియా) అనుమతిస్తూ సుప్రీంకోర్టు మార్చి 11న చరిత్రాత్మక తీర్పునిచ్చింది. న్యాయస్థానం ఆదేశాలతో డాక్టర్లు హరీశ్ కు వైద్యం ఆపేశారు. క్రమంగా అతడి ఆరోగ్యం క్షీణింపజేసి మరణించేలా చేశారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌కు చెందిన 32 ఏళ్ల హరీశ్ రానా (32) పంజాబ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో ప్రమాదానికి గురయ్యాడు. 2013 ఆగస్ట్ 20న హాస్టల్ భవనం 2వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. తలకు తీవ్ర గాయమైంది. కోమాలోకి వెళ్లిపోయాడు. ఎన్ని ఆసుపత్రుల్లో చికిత్స చేయించినా ఫలితం లేకుండా పోయింది. అయితే, హరీశ్ ను ఆ స్థితిలో తల్లిదండ్రులు చూడలేకపోయారు. ఈ క్రమంలో కారుణ్య మరణానికి అనుమతించాలంటూ 2024 జూలైలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే పలు కారణాలతో ఈ పిటిషన్‌ను కొట్టివేసింది కోర్టు.

ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లారు హరీశ్ తల్లిదండ్రులు. వైద్య నివేదికలు పరీశిలించిన సుప్రీం ధర్మాసనం 2026 జనవరి 13న హరీశ్ తల్లిదండ్రులతో మాట్లాడింది. వారి అభిప్రాయాలను తెలుసుకుంది. మానవీయకోణంలో మర్యాదపూర్వక మరణాన్ని ప్రసాదించాలని వారు కోర్టును వేడుకున్నారు. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈ కేసు విచారణలో మార్చి 11న కీలక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. 13 ఏళ్లుగా జీవచ్ఛవంలా ఉన్న హరీశ్ రాణాకు కారుణ్య మరణానికి పర్మిషన్ ఇచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com