ఖతార్ ఎమిర్‌కు యూఏఈ అధ్యక్షుడి స్వాగతం

- March 31, 2026 , by Maagulf
ఖతార్ ఎమిర్‌కు యూఏఈ అధ్యక్షుడి స్వాగతం

అబుదాబి: యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, సోదర పర్యటన నిమిత్తం యూఏఈకి వచ్చిన ఖతార్ రాష్ట్ర ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీకి ఘన స్వాగతం పలికారు.అబుదాబిలో జరిగిన ఈ భేటీలో ఇరు దేశాధినేతలు ప్రాంతీయ పరిణామాలు, కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతలు మరియు వాటి ప్రభావాల పై విస్తృతంగా చర్చించారు.

ప్రస్తుత పరిస్థితులు ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతా స్థిరత్వం పై చూపుతున్న ప్రభావం, సముద్ర భద్రతకు ఏర్పడుతున్న ముప్పు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతున్న తీవ్ర ప్రభావం వంటి అంశాలు చర్చకు వచ్చాయి.

అలాగే యూఏఈ, ఖతార్ మరియు ఇతర ప్రాంతీయ దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ మద్దతుతో జరుగుతున్న ఉగ్రదాడులు, పౌరులు మరియు పౌర మౌలిక వసతుల పై దాడుల అంశాన్ని కూడా ఇరు నాయకులు ప్రస్తావించారు.తమ దేశాల భద్రత, సార్వభౌమాధికారం, భౌగోళిక సమగ్రతను కాపాడటంతో పాటు ప్రజల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.

ఈ సందర్భంగా యూఏఈ-ఖతార్ మధ్య ఉన్న సోదర సంబంధాలను మరింత బలోపేతం చేయడం, అభివృద్ధి ప్రాధాన్యతలకు అనుగుణంగా పలు రంగాల్లో సహకారాన్ని విస్తరించడం, ఇరు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనాలను పెంపొందించడం పై కూడా చర్చించారు.

ఈ సమావేశంలో యూఏఈ ఉపాధ్యక్షుడు, ఉప ప్రధానమంత్రి మరియు ప్రెసిడెన్షియల్ కోర్ట్ చైర్మన్ షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అబుదాబి డిప్యూటీ రూలర్ మరియు జాతీయ భద్రతా సలహాదారు షేక్ తహ్నూన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ప్రెసిడెన్షియల్ కోర్ట్ డిప్యూటీ చైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

ఖతార్ ఎమిర్‌తో పాటు ఆయన వ్యక్తిగత ప్రతినిధి షేక్ జాసిమ్ బిన్ హమద్ అల్ థానీ, ఖతార్ ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ, అమిరి దివాన్ చీఫ్ అబ్దుల్లా బిన్ మొహమ్మద్ అల్ ఖులైఫీ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com