IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం

- April 04, 2026 , by Maagulf
IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం

చెన్నై: ఐపీఎల్ 2026లో చెపాక్ వేదికగా జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కు భారీ షాక్ తగిలింది. 209 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ, బౌలింగ్ వైఫల్యంతో సొంతగడ్డపై పరాజయం పాలైంది. మరోవైపు, పంజాబ్ కింగ్స్ (PBKS) వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి టేబుల్‌లో తన జోరును కొనసాగిస్తోంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అద్భుత ప్రదర్శన చేసింది. చెన్నై నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ బ్యాటర్లు మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించడం విశేషం. గత 8 మ్యాచ్‌ల్లో సీఎస్కేపై పంజాబ్‌కు ఇది 7వ విజయం కావడం గమనార్హం.

చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 210 భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్ ఆరంభం నుంచే విధ్వంసం సృష్టించింది. ఓపెనర్ ప్రియాన్షు ఆర్య దొరికిన బంతి దొరికినట్టు బౌండరీ బాదేశాడు. ఒకానొక దశలో ఐపీఎల్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ బాదేస్తాడని అనుకున్నా మ్యాట్ హెన్రీ బౌల్డ్ చేయడంతో ఆ రికార్డు ఆగిపోయింది. 11 బంతులు ఆడిన ప్రియాన్షు ఆర్య మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 39 పరుగులు చేసి అవుటయ్యాడు.ప్రియాన్షు ఆర్య బౌండరీల మోతతో పంజాబ్ కింగ్స్ పవర్ ప్లేలో 68 పరుగులు చేసింది. ప్రియాన్షు అవుటయ్యే సమయానికి 4.2 ఓవర్లలోనే పంజాబ్ 61 పరుగులు చేయడం విశేషం.


మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. 34 బంతులు ఆడిన ప్రభ్‌సిమ్రాన్ ఆరు ఫోర్లు, ఒక ఫోర్‌తో 43 పరుగులు చేసి అనవసర రనౌట్‌కు ప్రయత్నించి వికెట్ కోల్పోయాడు. దాంతో పంజాబ్ 95 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది.గుజరాత్‌పై మ్యాచ్‌ని గెలిపించిన కూపర్ కాన్‌లీ ఈ మ్యాచ్‌లో కూడా అదే స్థాయి ప్రదర్శన చేశాడు. 22 బంతులు ఆడిన కాన్‌లీ ఆరు ఫోర్లతో 36 పరుగులు చేసి బౌండరీ వద్ద దొరికిపోయాడు. దాంతో పంజాబ్ కింగ్స్ 11.5 ఓవర్లలో 127 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది.మూడు వికెట్లు పడిన తర్వాత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తనదైన శైలిలో ఆడి పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

29 బంతులు ఆడిన సర్పంచ్ సాబ్ నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 50 పరుగులు చేసి విజయానికి 24 పరుగుల దూరంలో వికెట్ కోల్పోయాడు. ఆ వెంటనే 9 బంతుల్లో 10 పరుగులు చేసిన నేహాల్ వధేరా కూడా అవుటయ్యాడు.వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో పంజాబ్ డగౌట్‌లో కాస్త టెన్షన్ కనిపించినా శశాంక్ సింగ్ – మార్కస్ స్టాయినీస్ మ్యాచ్‌ని కూల్‌గా ముగించారు. శశాంక్ సింగ్ 6 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేయగా, మార్కస్ స్టాయినీస్ 3 బంతుల్లో 2 ఫోర్లతో 9 పరుగులు చేశాడు. దాంతో పంజాబ్ కింగ్స్ 18.4 ఓవర్లలో 210 స్కోర్ చేసి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కి వెళ్లగా, సీఎస్కే బాటమ్ ప్లేస్‌లోనే ఫిక్స్ అయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com