భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..

- April 12, 2026 , by Maagulf
భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..

అబుదాబి: యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ను నేడు అబుదాబిలో ఆత్మీయంగా ఆహ్వానించి కీలక చర్చలు నిర్వహించారు. భారత్–యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆర్థిక సహకారం, ప్రాంతీయ భద్రత అంశాలు సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చాయి.

ఈ సందర్భంగా డాక్టర్ జైశంకర్, భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలను యూఏఈ అధ్యక్షుడికి తెలియజేశారు. యూఏఈ నిరంతర భద్రత, అభివృద్ధి కోసం ఆయన ఆకాంక్షలు వ్యక్తం చేసినట్లు తెలిపారు. దీనికి ప్రతిగా షేక్ మహ్మద్ బిన్ జాయెద్, ప్రధాని మోదీకి తన శుభాకాంక్షలు తెలియజేయాలని జైశంకర్‌ను కోరుతూ, భారత్ ప్రజలకు మరింత అభివృద్ధి, సుభిక్షత కలగాలని ఆకాంక్షించారు.

సమావేశంలో కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్ మరియు కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్‌షిప్ అగ్రిమెంట్ (CEPA) కింద కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించారు. పరస్పర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించే మార్గాల పై చర్చించారు.

మధ్యప్రాచ్య తాజా పరిణామాలు, వాటి ప్రభావం ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రత, సముద్ర రవాణా, ఇంధన సరఫరాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పై ఎలా పడుతోందన్న అంశం పై ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

యూఏఈతో పాటు ప్రాంతంలోని ఇతర దేశాల్లో పౌరులు, పౌర మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఇరానియన్ దాడులను కూడా సమావేశంలో ప్రస్తావించారు. ఇవి సార్వభౌమత్వం, అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జైశంకర్, యూఏఈ తన భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు తీసుకుంటున్న అన్ని చర్యలకు భారత్ సంపూర్ణ సంఘీభావం తెలుపుతున్నట్లు స్పష్టం చేశారు.

ఈ సమావేశానికి దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ మరియు రక్షణ మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్, పలు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com