ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..

- April 13, 2026 , by Maagulf
ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..

భారత దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (FY27) సంబంధించి తన నియామక లక్ష్యాలను ప్రకటించింది. ఈ ఏడాది సుమారు 25,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు సంస్థ సీఈఓ కృతివాసన్ వెల్లడించారు.మార్కెట్ డిమాండ్‌ను బట్టి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం (FY26)లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, ఏకంగా 44,000 మంది గ్రాడ్యుయేట్లను నియమించుకొని ప్రైవేట్ రంగంలోనే రికార్డు సృష్టించిన టీసీఎస్, ఈసారి కొంత ఆచితూచి అడుగులు వేస్తోంది.

గత ఏడాది జరిగిన ఉద్యోగుల తొలగింపులపై కృతివాసన్ స్పందిస్తూ.. ప్రాజెక్టుల నిర్వహణ తీరులో వచ్చిన మార్పుల వల్లే సీనియర్ స్థాయి ఉద్యోగులను తగ్గించాల్సి వచ్చిందని, దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణం కాదని స్పష్టం చేశారు. పనితీరు బాగున్నంత వరకు ఉద్యోగుల కెరీర్‌కు ఎలాంటి ఢోకా ఉండదని ఆయన భరోసా ఇచ్చారు. ప్రస్తుతం కంపెనీ 40 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులను కలిగి ఉందని, వ్యాపార వాతావరణం స్థిరంగా ఉండటం సానుకూల అంశమని తెలిపారు. భవిష్యత్తు అవసరాల కోసం మరిన్ని పెట్టుబడులు పెట్టడంతో పాటు, నూతన భాగస్వామ్యాల ద్వారా వృద్ధిని సాధించడమే లక్ష్యంగా టీసీఎస్ అడుగులు వేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com