మే 1 నుంచి టీటీడీలో కొత్త రూల్స్..!
- April 14, 2026
తిరుమల: వేసవి సెలవుల దృష్ట్యా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మే 1వ తేదీ నుంచి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనుంది. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
వేసవిలో రికార్డు స్థాయిలో వచ్చే భక్తుల రద్దీని నియంత్రించేందుకు టీటీడీ అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మే 1వ తేదీ నుంచి వీఐపీ (VIP) బ్రేక్ దర్శనాలను మరియు స్లాటెడ్ సర్వదర్శనం (SSD) టోకెన్లను పూర్తిగా రద్దు చేయాలని భావిస్తున్నారు. సాధారణంగా వీఐపీ దర్శనాల కోసం ప్రతిరోజూ కేటాయించే 2 నుండి 3 గంటల సమయంలో కేవలం 3,800 మంది మాత్రమే దర్శనం చేసుకుంటున్నారు. అదే సమయాన్ని సామాన్య భక్తులకు కేటాయిస్తే ఏకంగా 15,000 మందికి స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుందని అధికారులు లెక్కగట్టారు. దీనివల్ల సామాన్యులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన అవసరం తగ్గుతుంది.
గత మూడు ఏళ్ల వేసవి గణాంకాలను పరిశీలిస్తే, మే నుండి జూలై వరకు ప్రతి నెలా సగటున 24 లక్షల మంది భక్తులు తిరుమలకు వస్తున్నారు. ఈ రద్దీని తట్టుకోవడానికి గత ఏడాది వైకుంఠ ఏకాదశి సమయంలో అమలు చేసిన సక్సెస్ ఫుల్ మోడల్ను ఈ వేసవిలోనూ అమలు చేయాలని టీటీడీ యోచిస్తోంది. ప్రస్తుతం ఎస్ఎస్డీ టోకెన్లు ఉన్నవారు కూడా దర్శనం కోసం దాదాపు 23 గంటలు వేచి చూడాల్సి వస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం దర్శన కేటగిరీలను క్రమబద్ధీకరిస్తే, సామాన్య భక్తులు కేవలం 8 నుండి 12 గంటల్లోనే దర్శనం పూర్తి చేసుకునే అవకాశం ఉంది.
టీటీడీ ప్రణాళిక ప్రకారం వీఐపీ కోటాను తగ్గించడం వల్ల ప్రతిరోజూ సగటున 80,000 మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించవచ్చని అంచనా. రద్దీ పెరిగే కొద్దీ సామాన్య భక్తులకు కేటాయించే సమయాన్ని పెంచడం ద్వారా ఎండల తీవ్రత నుంచి వారికి ఉపశమనం కలిగించవచ్చని బోర్డు భావిస్తోంది. త్వరలోనే దీనిపై టీటీడీ అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ మార్పుల ద్వారా సిఫార్సు లేఖలపై వచ్చే వీఐపీల సంఖ్య తగ్గి, సామాన్య భక్తుల దర్శనం వేగవంతం కానుంది. భక్తులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









