హైదరాబాద్ లో లండన్ వర్సిటీ క్యాంపస్

- April 15, 2026 , by Maagulf
హైదరాబాద్ లో లండన్ వర్సిటీ క్యాంపస్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యాప్తి కోసం గత కొన్ని నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న కృషి ఫలించింది.ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆఫ్ లండన్ తన ఆఫ్ షోర్ క్యాంపస్లు హైదరాబాద్లో ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. నగరంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, కాస్మోపాలిటన్ సంస్కృతి, అగ్రశ్రేణి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండటాన్ని దృష్టిలో ఉంచుకుని, అంతర్జాతీయ క్యాంపస్ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. హైదరాబాదు ఎంచుకున్న తొలి అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా చరిత్రలో ఈ యూనివర్సిటీ నిలవనుంది.

యూకేలోని కింగ్స్ కాలేజ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఈ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలుగా ఉన్నాయి. తాజాగా, ఆ విశ్వవిద్యాలయమే తెలంగాణలో తన క్యాంపస్ను ఏర్పాటు చేయనుంది. ఈ విశ్వవిద్యాలయానికి పూర్తి స్థాయి ఆఫ్ షోర్ క్యాంపస్ గా హైదరాబాద్ ప్రాంగణం నిలువనుండడం విశేషం. తెలంగాణను అన్ని రంగాలకు తగినట్టుగా నిలిపేందుకు, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలను తీసుకువచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు, ఆదేశాలిస్తూ వచ్చారు.

రాబోయే రెండేళ్ల కాలంలో, ప్రపంచ ప్రఖ్యాత ఉన్నత విద్యా సంస్థల ఆఫ్ షోర్ క్యాంపస్లతో కూడిన ఒక నాలెడ్జ్ హబ్న భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్మించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. పరిశోధనా సంస్థలు, సాఫ్ట్ వేర్, బయోటెక్, లైఫ్ సైన్సెస్ రంగాలు హైదరాబాద్లో ప్రతిష్టాంగా ఉండటం వల్ల ప్రధానంగా మరిన్ని యునైటెడ్ కింగ్డమ్ (యూకే) విశ్వవిద్యాలయాలు హైదరాబాద్లో క్యాంపస్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. భారత్ ఫ్యూచర్ సిటీలో శాశ్వత క్యాంపస్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత ఫ్యూచర్ సిటీలో ఎడ్యుకేషన్ జోన్లో ఈ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల ప్రాంగణాల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి.

కాగా, విశ్వవిద్యాలయాలు తమ విద్యా కార్యకలాపాలను వెంటనే ప్రారంభించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక చర్యలు తీసుకుంటోంది. నగరంలో యూనివర్సిటీ ఆఫ్ లండన్ తాత్కాలిక క్యాంపస్ హైదరాబాద్ లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ను వినియోగించుకునేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. 2027లో విద్యా సంవత్సరంలో కార్యకలాపాలను ప్రారంభించేందుకు యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రతినిధులు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తోంది. త్వరలో మరిన్ని అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో తెలంగాణ ప్రభత్వం ఒప్పందాలను కుదుర్చుకునే అవకాశం ఉంది.

మరోవైపు విశ్వవిద్యాలయాలు ఫ్యూచర్ సిటీలో శాశ్వత క్యాంపస్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నాయి. కాగా, హైదరాబాద్లో బ్రాంచ్ క్యాంపసులను ఏర్పాటు చేయడానికి ఇటీవల ముందుకు వచ్చిన యూకేకి చెందిన 13 పాఠశాలలకు సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు యూకే ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. జాతీయ విద్యా విధానం-2020లోని నిబంధనల ద్వారా, తమ ప్రాంగణాలను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపే అంతర్జాతీయ విద్యా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం మార్గం సుగమం చేసిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com