కువైట్: సౌదీ అరేబియాలో రాబోయే హజ్ సీజన్‌ను పురస్కరించుకొని కువైట్‌లోని భారత పౌరులకు రాయబార కార్యాలయం ద్వారా సౌదీ ట్రాన్సిట్ వీసాలను పొందేందుకు వీలు కల్పించిన సౌకర్యాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.

ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన జారీ చేసింది. దరఖాస్తుదారులు తమ సౌదీ ట్రాన్సిట్ వీసా అభ్యర్థనలను రాయబార కార్యాలయం ద్వారా పంపడానికి వీలు కల్పించిన ఈ ఏర్పాటును తదుపరి నోటీసు వచ్చేవరకు నిలిపివేసినట్లు తెలిపింది. 

సౌదీ అరేబియా మీదుగా ప్రయాణించాలని యోచిస్తున్న భారత పౌరులు.. ఏవైనా ప్రయాణ ఏర్పాట్లు చేసుకునే ముందు ఇమ్మిగ్రేషన్, ట్రాన్సిట్ విధానాలు మరియు వీసా సంబంధిత అంశాలపై తాజా సమాచారం కోసం నేరుగా వారి సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించింది.

ఈ కాలంలో పాత విధానం కింద సౌదీ ట్రాన్సిట్ వీసాల కోసం ఎలాంటి కొత్త అభ్యర్థనలను స్వీకరించబోమని లేదా ప్రాసెస్ చేయబోమని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.