గ్రేటర్ హైదరాబాద్‌లో సీట్ల జాతర

- April 16, 2026 , by Maagulf
గ్రేటర్ హైదరాబాద్‌లో సీట్ల జాతర

హైదరాబాద్: పార్లమెంటులో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై చర్చ మొదలవడంతో తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో రాజకీయ సందడి నెలకొంది. గత రెండు దశాబ్దాలుగా నగరం ఊహించని రీతిలో విస్తరించడంతో, రాబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల సంఖ్య భారీగా పెరగనుంది.

2004 తర్వాత ఐటీ రంగం విస్తరణతో రంగారెడ్డి జిల్లా మరియు హైదరాబాద్ శివారు ప్రాంతాలకు వలసలు విపరీతంగా పెరిగాయి. ఒకప్పుడు గ్రామాలుగా ఉన్న శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్ వంటి ప్రాంతాలు ఇప్పుడు లక్షలాది మంది జనాభాతో మెట్రో నగరంలో కలిసిపోయాయి.

41 మంది ఎమ్మెల్యేలు: ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న నియోజకవర్గాల సంఖ్య పెరిగి, భవిష్యత్తులో సుమారు 41 మంది ఎమ్మెల్యేలు ఈ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో కనీసం 7 కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పడే అవకాశం ఉంది. జనాభా ప్రాతిపదికన గ్రేటర్ పరిధిలో మరో కొత్త లోక్‌సభ స్థానం కూడా ఆవిర్భవించవచ్చని భావిస్తున్నారు. ఇది జరిగితే జాతీయ రాజకీయాల్లో గ్రేటర్ హైదరాబాద్ ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. నియోజకవర్గాల పునర్విభజన కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే కాకుండా, ‘హైబ్రిడ్ పద్ధతి’ (జనాభాతో పాటు అభివృద్ధిని పరిగణనలోకి తీసుకోవడం) లో జరగాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. జనాభా నియంత్రించిన రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ఉండాలంటే ఈ పద్ధతి అవసరమని ఆయన వాదిస్తున్నారు. ఒకప్పుడు శివారు ప్రాంతాలుగా ఉన్న శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, రాజేంద్రనగర్ వంటి నియోజకవర్గాలను విభజించి కొత్త స్థానాలను ఏర్పాటు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతో రాజకీయ పార్టీలు ఇప్పుడు తమ వ్యూహాలను శివారు ప్రాంతాలపై కేంద్రీకరిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com