10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!

- April 19, 2026 , by Maagulf
10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!

యూఏఈ: జెట్ ఇంధన ధరల పెరగడం, ఎయిర్ స్పేస్ మూసివేతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన ఛార్జీలు 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.  ఈ పెరుగుదల భారాన్ని సుదూర ప్రయాణాలు చేసేవారు అధికంగా భరించాల్సి వస్తుందని ట్రావెల్ రంగ నిపుణులు తెలిపారు. 

అయితే, ఒక కొత్త అధ్యయనం ప్రకారం గల్ఫ్ విమానయాన సంస్థలు గణనీయమైన నగదు నిల్వలను కలిగి ఉన్నందున, పెరుగుతున్న ఇంధన ఖర్చులను భరించగలవని, ఛార్జీలు పెంచే యోచన చేయకపోవచ్చని చెప్పడం ఊరటనిచ్చింది.  

“ఇరాన్ యుద్ధం కారణంగా పెరిగిన నిర్వహణ ఖర్చులను భర్తీ చేయడానికి విమానయాన సంస్థలు ఇప్పటికే విమాన ఛార్జీలను పెంచుతున్నాయి. ఇంధనంపై అదనపు ఛార్జీలను విధిస్తున్నాయి. కానీ, ఈ చమురు సంక్షోభం విస్తృత ఆర్థిక పరిణామాల వల్ల డిమాండ్ బలహీనపడుతున్న నేపథ్యంలో విమానయాన సంస్థలు చార్జీల పెంపులను తగ్గించే అవకాశం ఉంది.  రెండు నెలల సంఘర్షణ వల్ల పెరిగిన చమురు మరియు జెట్ ఇంధన ధరలు, ప్రాథమిక విమాన ఛార్జీలలో 5-10 శాతం పెరుగుదలకు దారితీస్తాయి.” అని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ తన తాజా నివేదికలో వెల్లడించింది.   

మిడిలీస్టు అంతటా గగనతలాన్ని మూసివేయడం వల్ల విమానయాన సంస్థలు తమ విమానాల మార్గాలను మార్చుకోవాల్సి వస్తుందని, దీనివల్ల నిర్వహణ ఖర్చులు పెరుగుతాయని, ఫలితంగా ఒక్కో విమానానికి ఇంధనం అధికంగా ఖర్చవుతుందని, ప్రయాణికులపైనే ఆ అదనపు భారాన్ని మోపే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.

ఫిబ్రవరి 28న మిడిలీస్టు యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి జెట్ ఇంధన ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి.  సాధారణంగా ఒక విమానయాన సంస్థ నిర్వహణ ఖర్చులలో జెట్ ఇంధనం 25-35 శాతం ఉంటుంది. కొన్ని తక్కువ ధరల విమానయాన సంస్థలకు, నిర్వహణ ఖర్చులలో ఇంధనం 60 శాతం వరకు ఉంటుంది.   

ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ 2024-25 ఫలితాల ప్రకారం, పెరిగిన కార్యకలాపాలకు అనుగుణంగా ఇంధనంతో సహా ఎమిరేట్స్ నిర్వహణ ఖర్చులు 4 శాతం పెరిగాయి. విమానయాన సంస్థ నిర్వహణ ఖర్చులలో 30 శాతంతో ఇంధనం అతిపెద్ద భాగంగా ఉంది.  2025లో ఫ్లైదుబాయ్ మొత్తం నిర్వహణ ఖర్చులలో ఇంధన వ్యయాల వాటా 25 శాతంగా ఉంది.

అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య సైనిక ఘర్షణ కారణంగా 2026లో మధ్యప్రాచ్యంలో విమాన ప్రయాణీకుల డిమాండ్ దాదాపు 41 శాతం మేర పడిపోతుందని ఈ అధ్యయనం అంచనా వేసింది.

భారీ నగదు నిల్వలు

గల్ఫ్ ప్రాంతంలో ఖతార్ ఎయిర్‌వేస్, ఎమిరేట్స్ మరియు ఎతిహాద్ ఎయిర్‌వేస్ వంటి అగ్రశ్రేణి విమానయాన సంస్థలు ప్రస్తుతం పటిష్టమైన ఆర్థిక స్థితిలో ఉన్నాయని తెలిపింది. వాటి వద్ద ఉన్న భారీ నగదు నిల్వలు, స్వల్పకాలంలో పెరుగుతున్న ఖర్చులను భరించడానికి వాటికి మరింత బలాన్ని ఇస్తున్నాయని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ పేర్కొంది.

ఎమిరేట్స్ గ్రూప్ ఫలితాల ప్రకారం..2025-26 మొదటి అర్ధభాగం సెప్టెంబర్ 30, 2025 నాటికి Dh56 బిలియన్ల ($15.2 బిలియన్లు) రికార్డు స్థాయి నగదు నిల్వతో ముగిసింది. ఇది భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడానికి యూఏఈ మరియు ప్రాంతీయ విమానయాన సంస్థలు అనుభవిస్తున్న పటిష్టమైన స్థానాలను ప్రతిబింబిస్తుంది.

అయితే, గల్ఫ్ విమానయాన సంస్థలు సుదూర మరియు ట్రాన్సిట్ ట్రాఫిక్‌పై ఎక్కువగా ఆధారపడటం వలన అవి ప్రమాదంలో ఉన్నాయని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ హెచ్చరించింది. "టికెట్ ధరలో ఇంధనం వాటా చాలా ఎక్కువగా ఉన్నందున, ఈ పెంపుదలల భారాన్ని సుదూర ప్రయాణాలు ఎక్కువగా మోయాల్సి వస్తుంది. పెరిగిన ధరల వల్ల ప్రయాణికులు తమ సుదీర్ఘ ప్రయాణాలను వాయిదా వేసుకోవచ్చు లేదా రద్దు చేసుకోవచ్చు." అని నివేదిక పేర్కొంది.

అమెరికాలో ఇటీవలి సంవత్సరాలలో విమానయాన సంస్థలు ఫ్యూయల్ హెడ్జింగ్‌ను నిలిపివేశాయి.వారు పెరిగిన ఇంధన ఖర్చులను, కనీసం పాక్షికంగానైనా, అధిక విమాన ఛార్జీల రూపంలో వినియోగదారులపై మోపుతారు. 2026 ద్వితీయార్థంలో దాదాపు అన్ని ప్రాంతీయ విమాన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యేందుకు వీలుంటుందని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ అంచనా వేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com