కువైట్ అమీర్‌కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!

- April 22, 2026 , by Maagulf
కువైట్ అమీర్‌కు  క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!


కువైట్ః కువైట్‌లోని భారత రాయబారి పరామిత త్రిపాఠి బయాన్ ప్యాలెస్‌లో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో కువైట్ దేశ అమీర్ షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబాహ్‌కు తన నియామక పత్రాలను(క్రెడెన్షియల్స్) సమర్పించారు. కువైట్‌కు భారతదేశం నుండి 20వ మరియు మొదటి మహిళా రాయబారిగా ఆమె గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా ఆమె తన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించాలని ఆయన శుభాకాంక్షలు తెలిపారు. భారత్ మరియు కువైట్ మధ్య బలమైన చారిత్రక మరియు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. పరస్పర ఆసక్తి ఉన్న రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవడానికి కువైట్ అధిక ప్రాధాన్యత ఇస్తుందని పునరుద్ఘాటించారు.
ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితి దృష్ట్యా కువైట్ దేశానికి భారత్ సంఘీభావం తెలుపుతుందని రాయబారి తెలియజేశారు. శాంతి, స్థిరత్వానికి సంపూర్ణ మద్దతును పునరుద్ఘాటించారు. ఉమ్మడి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో కువైట్‌తో నిరంతర సహకారానికి భారత్ కట్టుబడి ఉందని ఆమె తెలియజేశారు. రెండు దేశాల మధ్య సజీవ వారధిగా పనిచేస్తున్న కువైట్‌లోని భారతీయ సమాజానికి అందిస్తున్న నిరంతర మద్దతును రాయబారి ప్రశంసించారు. వాణిజ్యం మరియు పెట్టుబడి, రక్షణ మరియు భద్రత, ఇంధనం మరియు ఆరోగ్య సంరక్షణ, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణ మరియు నైపుణ్యం, ప్రజల మధ్య సంబంధాలు వంటి కీలక రంగాలలో సహకారాన్ని మరింతగా పెంపొందించడం ద్వారా భారత్-కువైట్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాల ఉమ్మడి నిబద్ధతను ఆమె వెల్లడించారు.  

భారత్ మరియు కువైట్ చారిత్రాత్మకంగా సన్నిహిత మరియు స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉన్నాయి. బలమైన చారిత్రక మరియు ఆర్థిక బంధాలు, భౌగోళిక సామీప్యత, సాంస్కృతిక అనుబంధం మరియు ప్రజల మధ్య  సంబంధాలు దీనికి పునాదిగా ఉన్నాయి. ఈ సంవత్సరం భారత్, కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 65 సంవత్సరాలు పూర్తవుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com