ప్రధాని మోదీ పై ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు!

- April 25, 2026 , by Maagulf
ప్రధాని మోదీ పై ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు!

న్యూ ఢిల్లీ: దేశంలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో రాజకీయ విమర్శలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, దిల్లీ మరియు మణిపూర్ వంటి ప్రాంతాలలో జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ ప్రతిపక్ష నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని కడిగిపారేస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళా భద్రత గురించి ప్రధాని ఇచ్చే ఉపన్యాసాలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలకు ఏమాత్రం సంబంధం లేదని ఆమె మండిపడ్డారు.

ఉత్తరప్రదేశ్‌లోని గాజీపుర్‌లో ఏప్రిల్ 14న అదృశ్యమై, మరుసటి రోజు శవమై తేలిన మైనర్ బాలిక ఘటనను ఆమె ప్రస్తావించారు. పోలీసులు కేసు నమోదుకు విముఖత చూపడం, బాధితులను బెదిరించడం వంటి చర్యలు బీజేపీ పాలనలో సర్వసాధారణంగా మారాయని ఆరోపించారు. ఉన్నావ్, హత్రాస్, ప్రయాగ్‌రాజ్ వంటి ఘటనల్లో ప్రభుత్వం బాధితుల పక్షాన కాకుండా నిందితుల పక్షాన నిలిచిందని ప్రియాంక ఆరోపించారు.

ఇటీవల బెంగాల్ పర్యటనలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై టీఎంసీ నేత శశి పంజా ఘాటుగా స్పందించారు.

బీజేపీ అధికారంలో ఉంటే రాత్రి 1 గంటకు కూడా మహిళలు బయట తిరగవచ్చని అమిత్ షా చెబుతుంటే, ఆయన నేరుగా పర్యవేక్షించే దిల్లీ పోలీస్ వ్యవస్థ పరిధిలో మహిళలపై నేరాలు ఎందుకు పెరుగుతున్నాయని ఆమె ప్రశ్నించారు. ఇటీవల 22 ఏళ్ల ఐఐటీ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై కేంద్రం ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. బెంగాల్ ఎన్నికలకు కేంద్ర బలగాలను పంపే ప్రభుత్వం, మణిపూర్‌లో మహిళలపై దాడులు జరుగుతున్నప్పుడు అదే స్థాయిలో సైన్యాన్ని ఎందుకు పంపలేదని శశి పంజా ఎద్దేవా చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com