ET బిజినెస్ రిఫార్మర్ అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు

- April 26, 2026 , by Maagulf
ET బిజినెస్ రిఫార్మర్ అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు

ముంబై: ముంబైలో జరిగిన ఎకనామిక్ టైమ్స్ ప్రతిష్టాత్మక బిజినెస్ అవార్డుల కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం అందుకున్నారు. పారిశ్రామికాభివృద్ధి, పరిపాలనలో సాంకేతికతను జోడించి ఆయన చేసిన సంస్కరణలకు గుర్తింపుగా జాతీయ స్థాయి జ్యూరీ ఈ అవార్డును ప్రకటించింది. ఈ వేడుకకు పారిశ్రామిక దిగ్గజాలు, కేంద్ర మంత్రులు,పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

చంద్రబాబు నాయుడు గత నాలుగు దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు నవ్యాంధ్రలో ఐటీ, సేవలు మరియు తయారీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారని ఎకనమిక్ టైమ్స్ ప్రశంసించింది. ముఖ్యంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడం, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలను ప్రవేశపెట్టడం వంటి చర్యలు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని జ్యూరీ అభిప్రాయపడింది. విజన్ 2020 నుంచి నేటి అమరావతి అభివృద్ధి వరకు ఆయన చూపిన దూరదృష్టిని ఈ సందర్భంగా ప్రశంసించారు.

సంస్కరణలు అనేవి నిరంతర ప్రక్రియ అని, సామాన్యుడి జీవితంలో మార్పు తెచ్చినప్పుడే ఆ సంస్కరణలకు అర్థం ఉంటుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో ఏపీని దేశంలోనే నంబర్ వన్ ఆర్థిక శక్తిగా మార్చడమే తన లక్ష్యమని, పారిశ్రామిక వేత్తలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థకు దిక్సూచిగా నిలిచిన పలువురు సీఈఓలు కూడా చంద్రబాబు నాయుడును అభినందించారు. దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి పునాదులు వేసిన నాయకుడిగా ఆయన పేరు నిలిచిపోతుందని బిజినెస్ వరల్డ్ ప్రముఖులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com