బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..

- May 01, 2026 , by Maagulf
బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ వాసులకు శుభవార్త.. క్యాన్సర్ చికిత్స కోసం వారంతా ఇకపై హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు. ఏపీ రాజధాని అమరావతిలోనే వారికి ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ చికిత్సకు పేరుగాంచిన బసవతారకం ఆస్పత్రిని అమరావతిలో కూడా నిర్మిస్తున్నారు. తుళ్లూరు సమీపంలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా మే 1, శుక్రవారం నాడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ.. అమరావతి నిర్మాణం, రైతుల త్యాగం, ఆస్పత్రి ప్రాజెక్ట్‌పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి భూములు త్యాగం చేసిన రైతులు, మహిళలకు ఈ సందర్భంగా బాలకృష్ణ పాదాభివందనం తెలిపారు. వారి సహకారం, సంకల్పం వల్లే ఈ ప్రాంతం అభివృద్ధి సాధ్యమైందన్నారు.

బసవతారకం ఆస్పత్రి నిర్మాణ పనుల ప్రారంభం గురించి మాట్లాడుతూ.. నేడు స్వాతి నక్షత్రం కావడం ప్రత్యేకమని, అది తనకు దైవసమానమైన తన తండ్రి, అలానే తన ఇష్టదైవం నరసింహ స్వామి పుట్టిన నక్షత్రం కావడంతో ఈ రోజున పనులు ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాజధాని అమరావతిలో గత సంవత్సరం ఆగస్టు 13ననే ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశామని, అయితే నిర్మాణం ప్రారంభించేందుకు పర్యావరణ అనుమతులు రావడానికి కాస్త సమయం పట్టిందన్నారు.

ఇప్పుడు అన్ని అనుమతులు పూర్తయ్యాయని, పనులు వేగంగా కొనసాగుతాయని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ తొలి దశలో 7 అంతస్తులతో 500 పడకల సదుపాయం కలిగిన ఆధునిక ఆస్పత్రిని నిర్మించనున్నట్లు వెల్లడించారు. దాదాపు రూ. 650 కోట్ల వ్యయంతో ఈ దశను అమలు చేయనుండగా, 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com