ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్
- May 05, 2026
ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు..సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం
సన్మానించిన నగర సీపీ సజ్జనర్..నగదు పురస్కారం, ప్రశంసా పత్రం అందజేత
హైదరాబాద్: నేరం జరుగుతుంటే చూస్తూ ఉండిపోవడం కాదు.. ఆ నేరగాడిని పట్టుకోవడమే అసలైన పౌర ధర్మమని నిరూపించారు ఒక సామాన్య ఆటో డ్రైవర్. ఒక మహిళా బాధితురాలి మెడలోని బంగారు గొలుసును రౌడీ షీటర్ లాక్కేళ్లేందుకు ప్రయత్నిస్తే.. ప్రాణాలకు తెగించి, తన ఆటోనే ఆయుధంగా మలచుకొని సాహసోపేతంగా మహమ్మద్ జాహెర్ రౌడీ షీటర్ ను అడ్డుకున్నారు. కర్రతో దాడి చేస్తోన్న బెదరకుండా ప్రతిఘటించారు.
ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. ఆయనకు ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.
మార్చి 4వ తేదీ తెల్లవారుజామున బేగం బజార్ జిన్సీ చౌరాహా ప్రాంతంలో మంజు ఓమ్లతా తన కోడలితో కలిసి మార్నింగ్ వాక్కు వెళ్లారు. హిందీ మర్వాడీ విద్యాలయ స్కూల్ వద్దకు చేరుకోగానే, డబీర్పురకు చెందిన రౌడీ షీటర్ మహ్మద్ సోహేల్ ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో నిందితుడి స్కూటీ అదుపుతప్పి కిందపడిపోయింది. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో, అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ ఈ దృశ్యాన్ని సైడ్ వ్యూ మిర్రర్ ద్వారా గమనించారు.
సంఘటన స్థలాన్ని దాటి సుమారు 100 మీటర్ల దూరం ముందుకు వెళ్లినప్పటికీ, జాహెర్ వెంటనే స్పందించి తన ఆటోను వేగంగా వెనక్కి తిప్పారు. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న రౌడీ షీటర్ బైక్ను తన ఆటోతో ఢీకొట్టి అతడిని కిందపడేశారు. ఆ సమయంలో నిందితుడు కర్రతో దాడి చేసినా భయపడకుండా ప్రతిఘటించి అడ్డుకున్నారు. ఆ సమయంలో పారిపోతుండగా వెంటనే గస్తీ తిరుగుతున్న పోలీసులు రౌడీ షీటర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ పని ముగించుకున్న జాహెర్, ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆటో డ్రైవర్ సాహసం గురించి గోషామహల్ పోలీసులకు బాధితురాలు తెలియజేశారు.
కాగా, ఈ వీరోచిత దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. రౌడీ షీటర్ ను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించి, నిస్వార్థంగా వెళ్లిపోయిన ఆ అజ్ఞాత వీరుడి కోసం గోషామహల్ పోలీసులు గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలో ఆటో నంబర్ను సేకరించి, సాంకేతిక పరిజ్ఞానంతో జాహెర్ను గుర్తించారు.
ఈ సందర్భంగా సీపీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ చూపిన సాహసం సమాజానికి ఆదర్శమన్నారు. “చూస్తుండగానే నేరాలు జరుగుతున్నా పట్టించుకోని ఈ రోజుల్లో, ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న జాహెర్ సమాజానికి నిజమైన రోల్ మోడల్. ఆయనలో ఒక అద్భుతమైన ప్రజా పోలీస్ ఉన్నారు. ఎలాంటి ప్రతిఫలం కూడా ఆశించలేదు. ఇలాంటి బాధ్యతాయుతమైన పౌరులు ఉన్నప్పుడే నేరస్తులకు భయం పుడుతుంది" అని ప్రశంసించారు.
నేరం జరుగుతున్నప్పుడు భయపడకుండా, మహమ్మద్ జాహెర్ వలె ధైర్యంతో స్పందించి వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని నగరవాసులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
కాగా, డబిర్ పూరకు చెందిన రౌడీ షీటర్ పై గోషా మహల్ పీఎస్ లో కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేశారు. అతడిపై వివిధ పోలీస్ స్టేషన్లలో 16 కేసులున్నాయి.
ఈ సన్మాన కార్యక్రమంలో గోల్కొండ జోన్ డీసీపీ జి. చంద్ర మోహన్, గోషామహల్ ఎస్హెచ్వో శ్రవణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!







