శ్రీసిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్

- May 06, 2026 , by Maagulf
శ్రీసిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్

శ్రీసిటీ: ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం శ్రీసిటీ పారిశ్రామికవాడలో బుధవారం ఉదయం అమెరికాకు చెందిన దిగ్గజ ఎయిర్ కండిషనర్ తయారీ సంస్థ క్యారియర్ ఏసీ తయారీ యూనిట్ కు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ముందుగా వేదిక ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు సంస్థ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అనంతరం క్యారియర్ గ్లోబల్ కార్పోరేషన్ ఛైర్మన్, సీఈవో డేవిడ్ ఎల్ గిట్లిన్ తో కలిసి మంత్రి లోకేష్ క్యారియర్ ఏసీ తయారీ పరిశ్రమకు భూమిపూజ చేశారు. అనంతరం సంస్థ ప్రతినిధులతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. దేశంలో క్యారియర్ సంస్థ కార్యకలాపాలు ఐదు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్నాయి. హర్యానాలోని గుర్ గ్రామ్ లో తయారీ యూనిట్, హైదరాబాద్ లో గ్లోబల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ను ఈ సంస్థ కలిగి ఉంది. ఏసీ తయారీరంగంలో పేరుగాంచిన క్యారియర్ గ్లోబల్.. రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో శ్రీసిటీలో అత్యాధునిక తయారీ యూనిట్ ను స్థాపించనుంది. ఈ ప్లాంట్ హెచ్ వీ ఏసీ(HVAC), సంబంధిత ఉత్పత్తులపై పెరుగుతున్న డిమాండ్ ను తీర్చడమే కాకుండా.. కార్యకలాపాల సామర్థ్యాన్ని, విస్తృతిని పెంచనుంది. శ్రీసిటీ పరిధిలోని ఆరూరు వద్ద ఈ పరిశ్రమకు 39 ఎకరాలను ప్రజాప్రభుత్వం కేటాయించింది.

ఈ కార్యక్రమంలో క్యారియర్ గ్లోబల్ కార్పోరేషన్ క్లైమేట్ సొల్యూషన్స్ ఏసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా ప్రెసిడెంట్ మేకేల్ ఎల్.గియర్టెస్, క్యారియర్ ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజిరేషన్ లిమిటెడ్(క్యారియర్ ఇండియా) మేనేజింగ్ డైరెక్టర్ సుందరేశన్ నారాయణన్, రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, క్యారియర్ గ్లోబల్ కార్పోరేషన్ ఆపరేషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మైక్ డుయిజర్, చీఫ్ పీపుల్ అండ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నడియా విల్లెనెవ్, శ్రీసిటీ కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com