డెహ్రాడూన్‌లో ఆర్చి కూలి ఏపీకి చెందిన ఆర్మీ జవాన్ మృతి

- May 10, 2026 , by Maagulf
డెహ్రాడూన్‌లో ఆర్చి కూలి ఏపీకి చెందిన ఆర్మీ జవాన్ మృతి

డెహ్రాడూన్‌: అనకాపల్లి జిల్లా వెంకుపాలెం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న మన తెలుగు బిడ్డ, ఆర్మీ నాయక్ రాపేటి పూర్ణచంద్రశేఖర్ (37) డెహ్రాడూన్‌లో జరిగిన ప్రమాదంలో తుదిశ్వాస విడిచారు. విధి నిర్వహణలో భాగంగా శుక్రవారం రాత్రి ఆయన ప్రయాణిస్తున్న ట్రక్కుపై ఆర్చి కూలడంతో ఈ దారుణం జరిగింది. ఈ ఘటనలో పూర్ణచంద్రశేఖర్ తో పాటు నాగాలాండ్‌కు చెందిన మరో సైనికుడు కూడా అక్కడికక్కడే మరణించారు.

పూర్ణచంద్రశేఖర్ తన కుటుంబాన్ని కేవలం నెలన్నర క్రితమే డెహ్రాడూన్‌కు తీసుకెళ్లారు. భార్య గ్రేసి, ఐదేళ్ల కొడుకు, రెండేళ్ల కూతురుతో కలిసి కొత్త జీవితం మొదలుపెట్టే లోపే ఈ ఘోరం జరగడం అందరినీ కలచివేస్తోంది. తన భర్త ఇక లేరనే వార్త విన్న గ్రేసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇంటికి ఆసరాగా ఉంటాడనుకున్న జవాన్ మరణవార్త విని వెంకుపాలెం గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఈ ఘటన పై స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ స్పందించారు. డెహ్రాడూన్ లోని ఆర్మీ ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జవాన్ భౌతిక కాయాన్ని సొంత ఊరికి తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. జనసేన నాయకులు భీమరశెట్టి రామకృష్ణ బాధిత కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. త్వరలోనే పూర్ణచంద్రశేఖర్ పార్థివ దేహాన్ని వెంకుపాలెం తీసుకువచ్చి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com