ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో విజయవంతంగా తలసేమియా రన్

- May 10, 2026 , by Maagulf
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో విజయవంతంగా తలసేమియా రన్

హైదరాబాద్: తలసేమియా వ్యాధిపై అవగాహన పెంపొందించడం, బాధిత చిన్నారులకు అండగా నిలవడం లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని జలవిహార్ వద్ద నిర్వహించిన “తలసేమియా రన్” ఘన విజయాన్ని సాధించింది. 3K, 5K, 10K విభాగాల్లో నిర్వహించిన ఈ రన్‌లో యువత, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగంగా మాట్లాడుతూ తలసేమియా వ్యాధి తీవ్రతను వివరించారు.

“ఒక చిన్న పరీక్ష ప్రాణాలను కాపాడగలదు”

“ఒక ఐదు సంవత్సరాల చిన్నారి ఆడుకోవాల్సిన వయసులో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తన బాల్యాన్ని కోల్పోతున్నాడు. ప్రతి 20 రోజులకు రక్త మార్పిడి అవసరం అవుతోంది. ఇదే తలసేమియా. కానీ అవగాహనతో ఈ వ్యాధిని నివారించవచ్చు. పెళ్లికి ముందు చేసే ఒక చిన్న రక్త పరీక్ష భవిష్యత్తును కాపాడగలదు” అని నారా భువనేశ్వరి పేర్కొన్నారు.

“ప్రతి రక్తపు చుక్క ఒక ప్రాణాన్ని కాపాడుతుంది”

ఈ రన్ కేవలం ఒక కార్యక్రమం కాదని, తలసేమియాపై అవగాహన కల్పించే సామాజిక ఉద్యమమని ఆమె అన్నారు. స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించడం ద్వారా తలసేమియా బాధిత చిన్నారుల ముఖాల్లో చిరునవ్వు తీసుకురావడమే ఎన్టీఆర్ ట్రస్ట్ లక్ష్యమని చెప్పారు.

“ఈరోజు మీరు కాళ్లతో కాదు… మనసుతో పరిగెత్తుతున్నారు. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం, వారి కుటుంబాల కోసం ఈ రన్ నిర్వహిస్తున్నాం” అని ఆమె తెలిపారు.

ప్రముఖుల పాల్గొనడం

ఈ కార్యక్రమంలో తలసేమియా రన్ బ్రాండ్ అంబాసిడర్‌గా భారత మాజీ స్టార్ క్రికెటర్ మిథాలి రాజ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి, సీపీ సజ్జనార్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక అల, సైబరాబాద్ సీపీ రమేష్, ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈవో మరియు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కె. రాజేంద్ర కుమార్, హీరోయిన్ మానస వారణాసి తదితర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై కార్యక్రమానికి మద్దతు తెలిపారు.

తలసేమియా బాధితుల కోసం ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరింత అవసరమని పలువురు అభిప్రాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com