భారత దేశవ్యాప్తంగా NEET పరీక్ష రద్దు..కేంద్రం సంచలన నిర్ణయం

- May 12, 2026 , by Maagulf
భారత దేశవ్యాప్తంగా NEET పరీక్ష రద్దు..కేంద్రం సంచలన నిర్ణయం

న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్రం. మే 3న జరిగిన ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. రాజస్థాన్ లో పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు రావడంతో కేంద్ర విద్యాశాఖ పరీక్షను రద్దు చేసింది. మే 3న నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిందనే వార్తలు రాజస్థాన్ లో కలకలం రేపాయి.

దర్యాఫ్తు సంస్థల నుంచి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం పరీక్ష ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లుగా కేంద్రం గుర్తించింది. దీంతో విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరీక్షను రద్దు చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించింది. ఈ పేపర్ లీక్ వెనుకున్న సూత్రధారులను పట్టుకోవడానికి కేసును సీబీఐకి అప్పగించారు.

రద్దు చేసిన పరీక్షను త్వరలోనే తిరిగి నిర్వహించనున్నారు. కొత్త తేదీలను ఎన్టీఏ తన అధికారిక వెబ్ సైట్ లో ప్రకటించనుంది. అయితే, రీ ఎగ్జామ్ కోసం విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ఎన్టీఏ క్లారిటీ ఇచ్చింది. పాత హాల్ టికెట్లు, కొత్త అడ్మిట్ కార్డుల ద్వారా ఎలాంటి అదనపు రుసుము లేకుండా పరీక్షకు హాజరు కావొచ్చని అధికారులు చెప్పారు. అయితే నీట్ పేపర్ లీక్, రద్దు అంశంపై విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. ఢిల్లీలో ఎన్ఎస్ యుఐ నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కారు. 24 లక్షల మంది విద్యార్థుల ఆశలను ఆవిరి చేశారని మండిపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com