విద్యార్థుల భద్రత కోసం ‘సురక్ష కవచ్’ హ్యాండ్‌బుక్ ఆవిష్కరణ

- May 15, 2026 , by Maagulf
విద్యార్థుల భద్రత కోసం ‘సురక్ష కవచ్’ హ్యాండ్‌బుక్ ఆవిష్కరణ

మాదకద్రవ్యాల నియంత్రణ, మానసిక ఆరోగ్యంపై అవగాహనకు ఎస్‌సీఎస్‌సీ ప్రత్యేక కార్యక్రమం

హైదరాబాద్: విద్యార్థుల భద్రత, సంక్షేమం మరియు మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSC) ఆధ్వర్యంలో “సురక్ష కవచ్ – కాలేజ్ సేఫ్టీ & వెల్-బీయింగ్ హ్యాండ్‌బుక్” ను ఆవిష్కరించారు. విద్యార్థుల నేతృత్వంలోని క్లబ్‌ల ద్వారా యువతను సాధికారులను చేయడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు, విద్యా రంగ నిపుణులు, మానసిక ఆరోగ్య నిపుణులు, పౌర సమాజ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొని విద్యాసంస్థల్లో సురక్షిత వాతావరణం కల్పించేందుకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మానసిక ఆరోగ్యం, బహిరంగ చర్చలు అవసరం: సీపీ రమేష్

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ మాట్లాడుతూ యువతలో పెరుగుతున్న ఒత్తిడి, ఒంటరితనం, వ్యసనాలను ఎదుర్కోవాలంటే బహిరంగ చర్చలు అవసరమన్నారు. భావోద్వేగ నియంత్రణ, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి విద్యార్థులకు ఎంతో కీలకమని పేర్కొన్నారు.

డ్రగ్ నెట్‌వర్క్‌లపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేసిన ఆయన, విద్యార్థులు తమ సమస్యలను కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు లేదా మెంటర్లతో స్వేచ్ఛగా పంచుకోవాలని సూచించారు. డ్రగ్స్ వ్యక్తులను మాత్రమే కాదు కుటుంబాలు, సమాజాన్నీ నాశనం చేస్తాయని, వాటి నిర్మూలనలో సమాజం సహకారం అవసరమని తెలిపారు.

సానుకూల లక్ష్యాలతో ముందుకు సాగాలి: రాహుల్ రవీంద్రన్

నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ పెరుగుతున్న వ్యసనాలు, తోటివారి ఒత్తిడి, అనారోగ్యకరమైన అలవాట్ల వల్ల కలిగే ప్రమాదాలపై విద్యార్థులను అప్రమత్తం చేశారు. యువత తమ జీవితాల్లో సానుకూల లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, ‘సురక్ష కవచ్’ వంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సురక్షితమైన క్యాంపస్‌ల నిర్మాణానికి తోడ్పడాలని కోరారు.

విద్యాసంస్థల బాధ్యత కీలకం

తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలక్రిస్టా రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమంలో విద్యాసంస్థల పాత్ర ఎంతో కీలకమన్నారు. క్యాంపస్‌లలో యాంటీ రాగింగ్ చర్యలు, భద్రతా యంత్రాంగాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

“మౌనంగా ఉండకండి” – విద్యార్థులకు పిలుపు

ఎస్‌సీఎస్‌సీ ప్రతినిధులు వనితా దాట్ల, చేతనా కాసం, శ్రీవిద్య రెడ్డి మాట్లాడుతూ యువత రక్షణ కోసం సమాజం, పోలీసులతో కలిసి ఎస్‌సీఎస్‌సీ నిరంతరం కృషి చేస్తోందన్నారు.

ఈ సందర్భంగా వైశాలి సాగర్ నేతృత్వంలో విద్యార్థులు “ముందుకు రండి, గళమెత్తండి.. మౌనంగా ఉండకండి” అనే సందేశాన్ని వినిపించారు.

యాంటీ డ్రగ్ కమిటీలు బలోపేతం చేయాలి

మహిళా మరియు శిశు భద్రతా విభాగం డీసీపీ కె. సృజన మాట్లాడుతూ విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీ మార్గదర్శకాలు, ‘పోష్’ మరియు ‘పోక్సో’ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. భద్రతా క్లబ్‌లను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

అనంతరం ఎస్‌సీఎస్‌సీ డైరెక్టర్ రష్మీ శ్రీవాస్తవ విద్యార్థులు, అధ్యాపకులతో ముఖాముఖి నిర్వహించి క్యాంపస్‌లలో సేఫ్టీ మరియు వెల్‌నెస్ క్లబ్‌ల ఏర్పాటుపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.కార్యక్రమం ముగింపులో ‘పాఠశాల’ యువ బృందం తెలుగు పాటలతో సందడి చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com