పుట్టపర్తిలో మూడు కీలక డిఫెన్స్ ప్రాజెక్టులకు శంకుస్థాపన

- May 15, 2026 , by Maagulf
పుట్టపర్తిలో మూడు కీలక డిఫెన్స్ ప్రాజెక్టులకు శంకుస్థాపన

పుట్టపర్తి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షణ, డ్రోన్ తయారీ రంగాలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చే దిశగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి వేదికగా సుమారు రూ. 2,959 కోట్ల విలువైన మూడు మెగా డిఫెన్స్ ప్రాజెక్టులకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు శంకుస్థాపన చేశారు.

ఈ భారీ ప్రాజెక్టులను దేశీయ రక్షణ రంగ దిగ్గజ సంస్థలైన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ,కల్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్, హెచ్‌ఎఫ్‌సీఎల్ సంయుక్తంగా ఏర్పాటు చేయనున్నాయి. ఈ పరిశ్రమల స్థాపన ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 1,935 మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అంచనా వేస్తున్నారు. కేవలం పెట్టుబడులకే పరిమితం కాకుండా, స్థానిక యువతకు సాంకేతిక నైపుణ్యంతో కూడిన ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తోంది.

పుట్టపర్తిలో ‘డ్రోన్ సిటీ’ ఆవిష్కరణ                                                                                           రక్షణ ప్రాజెక్టులతో పాటు పుట్టపర్తి ప్రాంతాన్ని అంతర్జాతీయ డ్రోన్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు డ్రోన్ సిటీ పనులకు కూడా శ్రీకారం చుట్టారు. పలు డ్రోన్ తయారీ పరిశ్రమలకు శంకుస్థాపన చేయడం ద్వారా డ్రోన్ సాంకేతికతకు ఏపీ కేంద్ర బిందువుగా మారనుంది.

ప్రముఖుల సమక్షంలో ఘనంగా కార్యక్రమం
ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌, కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్య ప్రసాద్ హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మరియు ఆయా సంస్థల ప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని కల్పిస్తూ, పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ ప్రభుత్వం తన పట్టును నిరూపించుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com