తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ ఏపీ పర్యటన విజయవంతం

- May 21, 2026 , by Maagulf
తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ ఏపీ పర్యటన విజయవంతం

ప్రవాస భారతీయుల సంక్షేమ కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష

అమరావతి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరీ కమిటీ రెండు రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ నెల 20, 21 తేదీల్లో నిర్వహించిన ఈ పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను సమీక్షించి ప్రశంసించారు.

తాడేపల్లిలోని APNRTS కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నారై శాఖ మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్, APNRTS అధ్యక్షులు మరియు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రవి వేమూరు, సీఈఓ కృష్ణమోహన్, డైరెక్టర్ ఆపరేషన్స్ అండ్ సర్వీసెస్ నాగేంద్ర బాబు అక్కిలి తదితర అధికారులు పాల్గొన్నారు.

సమావేశంలో ఎన్నారై సంక్షేమం, గల్ఫ్ కార్మికుల భద్రత, విదేశీ ఉపాధిపై అవగాహన కార్యక్రమాలు, నకిలీ రిక్రూట్‌మెంట్ ఏజెంట్ల నియంత్రణ, AP పోలీస్ NRI సెల్ సేవలు, 24 గంటల హెల్ప్‌లైన్, ప్రవాసాంధ్ర బీమా పథకం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్నారై సంక్షేమ కార్యక్రమాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

APNRTS డైరెక్టర్ ఆపరేషన్స్ అండ్ సర్వీసెస్ నాగేంద్ర బాబు అక్కిలి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి APNRTS అందిస్తున్న సేవలను అధ్యయనం చేయడం ఆనందదాయకమని తెలిపారు. ఇరు రాష్ట్రాల ఎన్నారై వ్యవస్థలు పరస్పర సహకారంతో కలిసి పనిచేస్తూ ప్రవాస భారతీయుల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య ఎన్నారై సేవల విషయంలో పరస్పర అవగాహన, సమన్వయం మరింత బలపడినట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com