తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా..

- May 22, 2026 , by Maagulf
తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా..

హైదరాబాద్: తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను చీఫ్ సెక్రటరీకి పంపారు. తనకు అప్పగించిన పనిని పూర్తి చేశానని, నివేదికను ప్రభుత్వానికి అందించినట్లు చెప్పారు. విద్యా పాలసీపై ప్రతిపాదనలు సిద్ధం చేశామని, విద్యా పాలసీకి అవసరమైన నివేదికను రూపొందించామని, ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించామని మురళి తెలిపారు. ప్రభుత్వానికి అవసరమైన సిఫార్సులు చేశానని, ఇక తన పని పూర్తైనందున రాజీనామా చేస్తున్నట్లు లేఖలో వివరించారు.

ఆకునూరి మురళి చైర్మన్ గా విద్యా కమిషన్ ను ఏర్పాటు చేసింది రేవంత్ ప్రభుత్వం. విద్యాశాఖలో సంస్కరణలపై విధివిధానాలను రూపొందించాలని సూచించింది. ఈ విషయంపై ఆకునూరి మురళి కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ను ప్రభుత్వం ఆమోదించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం తనకు అప్పగించిన పని పూర్తైందంటూ ఆయన రిజైన్ చేశారు.

2024 సెప్టెంబర్ లో ఆకునూరి మురళి చైర్మన్ గా విద్యా కమిషన్ ను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. తనకు అప్పగించిన పని పూర్తైందని, అందుకే తన పదవికి రాజీనామా చేశానని ఆకునూరి మురళి చెబుతున్నా.. విద్యా కమిషన్ ఇచ్చిన నివేదికలో పలు అంశాలు వివాదాస్పదం అయ్యాయి. అందులో ప్రధానంగా.. ప్రభుత్వ టీచర్ల వేతనాలను తగ్గించాలనే సిఫార్సు తీవ్ర వివాదమైంది. దీనిపై టీచర్లు భగ్గుమన్నారు. తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

కాగా, విద్యా కమిషన్ చేసిన సూచనల్లో అనేకం ఇంకా అమలు కావాల్సి ఉంది. దీనికి తోడు పదవీ కాలం ముగియడానికి ముందే ఆకునూరి మురళి రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశం చర్చకు దారితీసింది. గతంలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా ఉన్న సమయంలోనూ ఆకునూరి మురళి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com