ఒక తరం బాగుండాలనే ఆలోచన మాది: యెన్నం శ్రీనివాస్ రెడ్డి
- May 23, 2026
హైదరాబాద్: ఒక తరం బాగుండాలనే ఆలోచన మేము చేస్తుంటే , తమ కుటుంబమే బాగుండాలని ఆలోచిస్తోంది ఒక కుటుంబం” అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలోని ఐడీఓసీ లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెగా జాబ్ మేళా ద్వారా ఎంపికైన ఉద్యోగార్థులకు ఆఫర్ లెటర్లను అందజేశారు. అలాగే వివిధ క్రీడల్లో విజేతలైన క్రీడాకారులకు మెడల్స్, ప్రశంసాపత్రాలు అందించి, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు.
రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంతో పాటు, ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేసి, మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. డిగ్రీ కాలేజీలలో జాబ్ ఓరియెంటెడ్ కోర్సులను ప్రారంభించి యువతకు ఉపాధి అవకాశాలను పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు తగ్గినా, యువతకు నైపుణ్యాలు ఉంటే ఎక్కడైనా ఉద్యోగాలు పొందగలరనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇప్పటికే ఈ చర్యల ఫలితాలు కనిపిస్తున్నాయని తెలిపారు. విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తూ నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తోందన్నారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులను నియమిస్తూ విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో ఇంజనీరింగ్, లా కాలేజీలు, ట్రిపుల్ ఐటీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, అడ్వాన్స్ లెర్నింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. “తెలంగాణ రైజింగ్ విజన్ 2047” లక్ష్యంగా రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలపడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. యువత అవసరాలకు అనుగుణంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
హైదరాబాద్కు ప్రత్యామ్నాయంగా “భారత్ ఫ్యూచర్ సిటీ”
హైదరాబాద్కు ప్రత్యామ్నాయంగా “భారత్ ఫ్యూచర్ సిటీ” ప్రాజెక్ట్ను అభివృద్ధి చేస్తూ 40 లక్షల మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, గ్రీన్ ఫార్మా, రీసెర్చ్ & ఇన్నోవేషన్ రంగాలలో పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అయితే, గతంలో మంత్రిగా పనిచేసిన ఒక నాయకుడు విదేశాలకు వెళ్లి, ఈ ప్రాజెక్ట్ను వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. యువత భవిష్యత్తు కంటే ఒక కుటుంబ ప్రయోజనాలను ముందుకు పెట్టడం సరైంది కాదని ఆయన విమర్శించారు. దేశంలోని ప్రముఖ కంపెనీలను కూడా ఈ ప్రాజెక్ట్ పరిధిలోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు ఉన్నాయని, పలు జోన్లుగా అభివృద్ధి చేసి భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించనున్నామని పేర్కొన్నారు.
స్థానిక యువతకు ఉద్యోగాల కల్పన
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలోనే పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. యువతకు అవసరమైన శిక్షణ కూడా అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి ఖుష్బూ గుప్తా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, డివైఎస్ఓ రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, కార్పొరేటర్ ఎంపి ప్రవీణ్ కుమార్, వివిధ కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఒక తరం బాగుండాలనే ఆలోచన మాది: యెన్నం శ్రీనివాస్ రెడ్డి
- ప్రధాని మోదీని వైట్హౌస్కు ఆహ్వానించిన రూబియో
- స్విస్ అధ్యక్షుడికి లేఖ రాసిన ఒమన్ సుల్తాన్..!!
- ఆరోగ్య వ్యవస్థ ఫైనాన్సింగ్పై కువైట్, డబ్ల్యూహెచ్ఓ చర్చలు..!!
- బహ్రెయిన్ అత్యంత పురాతన హోటల్ పునరుద్ధరణ..!!
- ప్రపంచ ఆర్థిక, ఆహార భద్రతపై యూఏఈ హెచ్చరిక..!!
- ప్రభుత్వ సేవల సామర్థ్యంలో ఖతార్ కు టాప్ ర్యాంక్..!!
- తెలంగాణ పోలీసింగ్లో ఏఐ వినియోగానికి కార్యాచరణ: డీజీపీ సీవీ ఆనంద్
- సీఎం చంద్రబాబును కలిసిన అపోలో ప్రీతారెడ్డి
- యాదగిరిగుట్టలో అతిపెద్ద వేద పాఠశాల సముదాయానికి భూమిపూజ చేసిన సీఎం రేవంత్









