2026 హజ్ యాత్రను విజయవంతంగా ముగించిన సౌదీ అరేబియా..!!

- May 30, 2026 , by Maagulf
2026 హజ్ యాత్రను విజయవంతంగా ముగించిన సౌదీ అరేబియా..!!

రియాద్ః సౌదీ అరేబియా 2026 హజ్ యాత్రను విజయవంతంగా ముగించింది. విస్తృతమైన భద్రత ఏర్పాట్లు మరియు సేవల కారణంగా యాత్రికులు తమ ఆచారాలను సజావుగా నిర్వహించగలిగారని మక్కా ప్రాంత డిప్యూటీ గవర్నర్ ప్రిన్స్ సౌద్ బిన్ మిషాల్ బిన్ అబ్దుల్ అజీజ్ ప్రకటించారు. మక్కా గవర్నర్ మరియు హజ్, ఉమ్రా శాశ్వత కమిటీ ఛైర్మన్ ప్రిన్స్ ఖాలిద్ బిన్ ఫైసల్ బిన్ అబ్దుల్ అజీజ్, అంతర్గత వ్యవహారాల మంత్రి, సుప్రీం హజ్ కమిటీ ఛైర్మన్ ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ బిన్ అబ్దుల్ అజీజ్ తరపున హజ్ సీజన్ ముగింపు సందర్భంగా రెండు పవిత్ర మసీదుల సంరక్షకులు మహారాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ మరియు యువరాజు, ప్రధానమంత్రి అయిన ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ లకు డిప్యూటీ గవర్నర్ అభినందనలు తెలిపారు.
ఈ సంవత్సరం సాధించిన విజయం, భారీ జనసమూహాలను సమర్థవంతంగా నిర్వహించగల సౌదీ అరేబియా సామర్థ్యాన్ని ధృవీకరించిందని, తద్వారా ఆ ప్రదేశం పవిత్రతకు తగినట్లుగా యాత్రికులు భద్రత,  జాగ్రత్తలతో కూడిన వాతావరణంలో తమ ఆచారాలను నిర్వహించుకోవడానికి వీలు కల్పించిందని ఆయన అన్నారు.
మరోవైపు, తీవ్రమైన ఎండలో హజ్ యాత్రను పూర్తి చేసుకున్న వేలాది మంది ముస్లింలు పవిత్ర నగరాన్ని విడిచి వెళ్లడం ప్రారంభించారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల కారణంగా చెలరేగిన సంఘర్షణ నేపథ్యంలో ఈ సంవత్సరం 165 దేశాల నుండి 17 లక్షల మందికి పైగా ప్రజలు  పాల్గొన్నారని ఏఎఫ్‌పీ నివేదించింది. ఇదిలా ఉండగా, అంచనా వేసిన 86వేల మందిలో మూడింట ఒక వంతు అయిన 30వేల మందికి పైగా ఇరానీయులు మక్కా యాత్ర చేశారు. ఈ తగ్గుదలకు "యుద్ధకాల పరిస్థితి" కారణమని ఇరాన్ ప్రభుత్వం తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com