ఇరాన్ చమురు, పెట్రోకెమికల్ నెట్వర్క్ల పై అమెరికా కొత్త ఆంక్షలు
- May 30, 2026
వాషింగ్టన్: ఇరాన్పై కొనసాగిస్తున్న "మ్యాక్సిమమ్ ప్రెజర్" (గరిష్ట ఒత్తిడి) విధానంలో భాగంగా అమెరికా ప్రభుత్వం శుక్రవారం కొత్త ఆంక్షలను ప్రకటించింది. ఇరాన్ ప్రభుత్వం తన సైనిక కార్యకలాపాలు, ప్రాంతీయ అస్థిరతకు మద్దతుగా వినియోగిస్తున్న ఆదాయ వనరులను అడ్డుకోవడమే ఈ చర్యల ప్రధాన లక్ష్యమని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది.
అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి థామస్ పిగాట్ మాట్లాడుతూ, తాజా ఆంక్షలు ఇరాన్ అక్రమ చమురు ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నాయని తెలిపారు. చమురు, పెట్రోకెమికల్ ఉత్పత్తుల రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న సంస్థలు, వ్యక్తులు, నౌకలపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
ఈ మేరకు ఎనిమిది సంస్థలపై ఆంక్షలు విధించడంతో పాటు, ఇరాన్ పెట్రోలియం, పెట్రోకెమికల్ ఉత్పత్తుల రవాణాలో నేరుగా పాల్గొన్న ఎనిమిది నౌకలను ‘బ్లాక్డ్ ప్రాపర్టీ’గా గుర్తించినట్లు వెల్లడించారు. అదేవిధంగా, ఈ అక్రమ వ్యాపారానికి సంబంధించిన మూడు సంస్థలు, ఒక వ్యక్తిపై కూడా ఆంక్షలు విధించారు.
ఇటీవల అమెరికా ఆర్థిక శాఖ కూడా ఇరాన్ చమురు విక్రయాల భారీ నెట్వర్క్లో కీలకంగా వ్యవహరిస్తున్న పలువురి పై చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఈ తాజా నిర్ణయాలు వెలువడ్డాయి.
అమెరికా అధికారుల వివరాల ప్రకారం, హాంకాంగ్లోని షెల్ కంపెనీల ద్వారా నిర్వహించబడిన ఈ నెట్వర్క్ కోట్లాది బ్యారెళ్ల చమురును విక్రయించి బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. నిల్వ, రవాణా, విక్రయ ప్రక్రియలను గోప్యంగా నిర్వహించడం ద్వారా ఈ వ్యవస్థ పనిచేసిందని పేర్కొన్నారు.
ఈ ఆదాయం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC), ఇరాన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ (AFGS) వంటి సంస్థలకు నేరుగా చేరుతోందని అమెరికా ఆరోపించింది. ఈ నిధులు మధ్యప్రాచ్యంలో అస్థిరతను పెంచే కార్యకలాపాలకు ఉపయోగపడుతున్నాయని తెలిపింది.
ఇరాన్ అక్రమ చమురు వ్యాపారానికి సహకరించే ఏ సంస్థ లేదా దేశం పైనైనా కఠిన చర్యలు తీసుకోవడానికి అమెరికా వెనుకాడదని పిగాట్ హెచ్చరించారు. ఇరాన్ ఇంధన రంగానికి మద్దతు ఇవ్వడం లేదా వ్యాపార లావాదేవీలు నిర్వహించడం వల్ల అమెరికా ఆంక్షలను ఎదుర్కొనే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, అమెరికా విదేశాంగ శాఖ నిర్వహిస్తున్న "రివార్డ్స్ ఫర్ జస్టిస్" కార్యక్రమం కింద, ఐఆర్జీసీ మరియు దాని అనుబంధ సంస్థలకు నిధులు సమకూర్చే ఆర్థిక వ్యవస్థలను భంగం కలిగించే సమాచారాన్ని అందించిన వారికి గరిష్టంగా 15 మిలియన్ డాలర్ల వరకు బహుమతి ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- గంటకు 200 కిమీ వేగంతో దూసుకెళ్లనున్న 'ఎతిహాద్ రైల్'..
- విద్యార్థినులకు ప్రతినెలా మూడు సెలవులు
- టీబీ నిర్మూలన, మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన పెంచాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- ఇరాన్ చమురు, పెట్రోకెమికల్ నెట్వర్క్ల పై అమెరికా కొత్త ఆంక్షలు
- మార్కెట్లోకి భారీగా దొంగ నోట్లు..500, 200 నోట్లే టార్గెట్
- జూన్ 3వ తేదీన కర్ణాటక నూతన సీఎంగా డికే శివకుమార్ ప్రమాణ స్వీకారం!
- జూన్ 1 నుండి యూఏఈలో కఠినమైన వేతన రక్షణ చట్టం షురూ!
- రూ.34 కోట్ల బ్లడ్ మనీతో తప్పిన మరణశిక్ష! 20 ఏళ్ల తరువాత భారత్కు..
- సందర్శకులకు కీలక సూచనలు చేసిన దుబాయ్ మాల్..!!
- హజ్ యాత్రికులకు కువైట్ కీలక సూచనలు..!!









