CBSE బోర్డులో భారీ మార్పులు..

- June 03, 2026 , by Maagulf
CBSE బోర్డులో భారీ మార్పులు..

న్యూ ఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE)లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. బోర్డు ఉన్నతాధికారులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. సీబీఎస్ఈ చైర్మన్ రాహుల్ సింగ్, బోర్డు సెక్రటరీ హిమాన్షు గుప్తాలను తక్షణమే బదిలీ చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 12వ తరగతి పరీక్షల ఫలితాల డిజిటల్ మూల్యాంకనంలో వెలుగుచూసిన తీవ్ర లోపాలు, అలాగే బోర్డుకు చెందిన రీ-ఎవాల్యుయేషన్ పోర్టల్‌పై సైబర్ దాడి జరగడం వంటి వరుస వివాదాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఆన్‌స్క్రీన్ మార్కింగ్ విధానంలో లోపాలు.. విద్యార్థుల ఆగ్రహం

ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెట్టిన సరికొత్త ఆన్‌స్క్రీన్ మార్కింగ్ (OSM) లేదా డిజిటల్ మూల్యాంకన ప్రక్రియలో అనేక సాంకేతిక పరమైన ఇబ్బందులు తలెత్తాయి. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు, ఫిర్యాదులు వ్యక్తమయ్యాయి. ఆన్‌లైన్ స్క్రీన్‌పై జవాబు పత్రాలు సరిగ్గా కనిపించకపోవడం, కొన్ని ముఖ్యమైన పేజీలు మాయమవడం, కొన్ని ప్రశ్నలను దిద్దకుండానే వదిలేయడం, చివరకు ఒకరి ఆన్సర్ షీట్‌కు మరొకరి మార్కులను కేటాయించడం వంటి తీవ్రమైన నిర్లక్ష్యాలు ఈ విధానంలో బయటపడ్డాయి.

CBSE: రీ-ఎవాల్యుయేషన్ పోర్టల్‌పై భారీ సైబర్ దాడి

ఈ సమస్యలన్నింటికీ తోడు, జూన్ 2వ తేదీన ప్రారంభమైన విద్యార్థుల రీ-ఎవాల్యుయేషన్ (పునఃసమీక్ష) పోర్టల్‌పై ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే గుర్తుతెలియని వ్యక్తులు భారీ సైబర్ దాడికి తెగబడ్డారు. వెబ్‌సైట్‌ను స్తంభింపజేసే లక్ష్యంతో దాదాపు 15 లక్షల హిట్స్‌తో ‘డినైయల్-ఆఫ్-సర్వీస్’ (DoS) దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా, ఒకేసారి లక్షకు పైగా నకిలీ లాగిన్ ప్రయత్నాలు జరిగినట్లు సాంకేతిక నిపుణులు గుర్తించడంతో బోర్డు భద్రతా వైఫల్యాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

ఏకసభ్య కమిటీ ఏర్పాటు.. విద్యాశాఖ మంత్రి హామీ

ఈ పరిణామాలన్నింటిపై సమగ్ర విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. వివాదాస్పదంగా మారిన ఆన్‌స్క్రీన్ మార్కింగ్ (OSM) సేవల ఎంపిక, దాని అమలు తీరును పరిశీలించడానికి కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ ఎస్. రాధా చౌహాన్ నేతృత్వంలో ఒక ఏకసభ్య విచారణ కమిటీని నియమించింది. ప్రస్తుత సాంకేతిక సమస్యల వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తాము పూర్తిగా పరిష్కరిస్తామని, బాధ్యులపై కఠిన చర్యలతో పాటు అవసరమైన అన్ని దిద్దుబాటు చర్యలను తక్షణమే చేపడతామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టమైన హామీ ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com